
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ఒకటైన కోల్కతా నైట్ రైడర్స్కు ఈ ఏడాది గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. అతను కనుక సర్జరీ చేయించుకుంటే వన్డే వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానమే. ఇలాంటి సమయంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై తెగ చర్చలు జరిగాయి. వీటిని కేకేఆర్ యాజమాన్యం తెరదించింది.
శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్.. ఈ ముగ్గురూ కేకేఆర్లో చాలా కీలకమైన ఆటగాళ్లు. ఈ క్రమంలో వీరిలో ఒకరికి జట్టు పగ్గాలు అందిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఈ ముగ్గుర్నీ పక్కన పెట్టిన కేకేఆర్.. ఎవరూ ఊహించని విధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ నితీష్ రాణాను కెప్టెన్గా నియమించింది. ఈ నిర్ణయం అభిమానులకు చాలా షాకిచ్చింది. ఎవరూ కూడా రాణాకు కెప్టెన్సీ ఇస్తారని ఊహించలేదు. శార్దూల్ ఠాకూర్ ఈ ఏడాది కొత్తగా జట్టులో చేరినందుకే అతనికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.
రాణాకు కెప్టెన్సీ ఏం కొత్త కాదు. దేశవాళీల్లో ఢిల్లీ తరఫున ఆడే సమయంలో రాణాకు మొదటి సారి కెప్టెన్సీ అవకాశం దక్కింది. టీమిండియా మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ తర్వాత ఢిల్లీ జట్టుకు రాణానే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 నవంబరులో ఈ బాధ్యతలు స్వీకరించిన అతను.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 12 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. వీటిలో 8 మ్యాచుల్లో ఢిల్లీకి విజయాలు అందించాడు. ఈసారి ఎలాగైనా కోల్కతా నైట్ రైడర్స్కు ట్రోఫీ అందించేందుకు ప్రయత్నిస్తాడీ ఢిల్లీ బ్యాటర్.
ఐపీఎల్ మినీ వేలానికి ముందు నితీష్ రాణాను రూ.8 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది. ఇప్పటి వరకు కేకేఆర్ తరఫున 74 టీ20లు ఆడిన అతను 17వవ పరుగులు చేశాడు. వీటిలో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా రాణా మొత్తం 91 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ఈ మ్యాచుల్లో 2181 పరుగులు చేశాడు. 2015 నుంచి 2018 వరకు మూడేళ్లపాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. గతేడాది కూడా రాణా రాణించాడు. 14 మ్యాచుల్లో 143 స్ట్రైక్ రేటుతో 361 రన్స్ చేశాడు.
ఇలా ఎవరూ ఊహించని విధంగా రాణాకు కేకేఆర్ కెప్టెన్సీ అందించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ నిర్ణయం మంచిదే అంటుండగా.. మరికొందరేమో పెదవి విరుస్తున్నారు. రాణాకు షారుఖ్ ఖాన్కు సంబంధించి ఏవో సీక్రెట్స్ తెలిసి ఉంటాయని, అందుకే అతన్ని కెప్టెన్ చేశారని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలకు రాణా తన కెప్టెన్సీతో సమాధానం చెప్తాడేమో చూడాలి.