
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. కోల్కతా వరుసగా గత ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో ఆడిన 9 మ్యాచ్లలో మూడింట్లో మాత్రమే గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో 6పాయింట్లతో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ సీజన్లో ప్లేఆఫ్కు చేరుకోవడానికి మిగిలిన మ్యాచ్లన్నింటినీ కేకేఆర్ గెలవాల్సి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్.. లీగ్లో తమ అవకాశాలను ఉంచుకోవాలంటే.. నేడు రాజస్థాన్ రాయల్స్తో వారు తలపడబోయే మ్యాచ్లో ఆ జట్టు తమ జైత్రయాత్రను ప్రారంభించక తప్పదు. కానీ జోస్ బట్లర్, యుజ్వేంద్ర లాంటి మ్యాచ్ విన్నర్లు కలిగిన రాజస్థాన్ రాయల్స్ ను నిలువరించడం కేకేఆర్కు కత్తి మీద సామే అని చెప్పాలి. కేకేఆర్ ప్లేయర్లు సమిష్టిగా సత్తా చాటితే తప్పా.. రాజస్థాన్ను ఓడించడం కష్టం.
ఇక ఈ మ్యాచ్కు ముందు కేకేఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఫ్యాన్స్కు సందేశమిచ్చాడు. ఇక తమ చివరి ఐదు మ్యాచ్లను ఐదు ఫైనల్ మ్యాచ్ల్లా భావించి దీటుగా ఆడుతామని ప్రతిజ్ఞ చేశాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా జట్టును ఉత్సాహపరుస్తున్న అభిమానులకు రస్సెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.
రస్సెల్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ మొదలైన ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి పొజిషన్లో ఉంటామని మేము అనుకోలేదు. మేం చాలా వెనకబడ్డాం. అయినా ఈ పరిస్థితుల్లోనూ మమ్మల్ని ఆదరించి.. మాపై నమ్మకముంచిన అభిమానులుగా మీరు ఉండడాన్ని నేను అభినందిస్తున్నా. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. మేము ఇంకా ఆటలో అవకాశాల పరంగా సజీవంగానే ఉన్నాం. మా అందరి తరఫున మేము మున్ముందు గోల్డెన్ ప్రదర్శన చేస్తామని హామీ ఇస్తున్నా. కీప్ సపోర్టింగ్ అజ్.. మేము చివరి వరకు పోరాడుతాం, ఈ ఐదు మ్యాచ్లను అయిదు ఫైనల్ మ్యాచ్లుగా భావించి ఆడుతాం' అని రస్సెల్ తెలిపాడు.

ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే.. వారు మిగిలిన అయిదు మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. కాగా.. వారి ముందు కఠినమైన ప్రత్యర్థి జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. టోర్నమెంట్లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఇప్పటికే నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్తో కేకేఆర్ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్తో ఒక మ్యాచ్, ముంబై ఇండియన్స్తో ఒక మ్యాచ్, రాజస్థాన్ రాయల్స్తో ఒక మ్యాచ్ కేకేఆర్ ఆడనుంది.