లండన్: బ్యాట్స్మెన్ అవుట్ విషయంలో అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడనే కారణంపై నిన్నటికి నిన్న టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీపై భారీ జరిమానా విధించారు. విరాట్ కోహ్లీకి చెల్లించే మ్యాచ్ ఫీజులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 25 శాతానికి కోత పెట్టింది. తాజాగా- న్యూజీలాండ్ జట్టు పైనా భారీ జరిమానా పడింది. ఆ జట్టు కేప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టారు. మ్యాచ్ ఆడిన జట్టు సభ్యలకు 10 శాతం చొప్పున ఫీజులో కోత విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు: అదర గొట్టిన ఆసీస్ బ్యాట్స్మెన్
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా న్యూజీలాండ్ వెస్టిండీస్తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్ను అయిదు పరుగుల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ ఆ జట్టుపై చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలో కన్నా ఒక ఓవర్ తక్కువగా వేసినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఫలితంగా- కేప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఫీజులో 20శాతం, తుది జట్టు సభ్యులకు 10 శాతం కోత పెట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కివీస్ జట్టు కేప్టెన్ విలియమ్సన్ నుంచి వివరణ కోరారు. ఆయన సంతృప్తికరమైన వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. జరిమానా మాత్రం తప్పలేదు. కొద్దిరోజుల కిందటే అంపైర్లు విరాట్ కోహ్లీపైనా భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.