ఫాలో ఆన్లో భారీ స్కోరు..
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కివీస్ కేవలం 209 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన ఈ జట్టు కేన్ విలియమ్సన్ (132), టామ్ బ్లండెల్ (90)తోపాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో 483 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ నిలిచింది. లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ బాగానే ఆరంభించింది. అయితే తమకు దక్కిన ఆరంభాలను ఓపెనర్లు ఇద్దరూ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
ఒక్క పరుగు దూరంలో..
జాక్ క్రాలీ (24), బెన్ డకెట్ (33) పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత వచ్చిన ఓలీ రాబిన్సన్ (2), బెన్స్టోక్స్ (33), బెన్ ఫోక్స్ (35), స్టువర్ట్ బ్రాడ్ (11), జేమ్స్ ఆండర్సన్ (4), జాక్ లీచ్ (1 నాటౌట్) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన జో రూట్ (95) ఈ ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా ఆడాడు. మరో సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ (0) ఒక్క బంతి ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు చివరకు 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకే ఒక్క పరుగు తేడాతో కివీస్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది.
బాజ్బాల్ బొక్కబోర్లా..
కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. కెప్టెన్ టిమ్ సౌథీ మూడు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ టెస్టు క్రికెట్ అంటే ఇలా ఉండాలి కదా అని మెచ్చుకుంటున్నారు. మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఏమాత్రం ప్రభావం చూపకుండా.. ఫాలో ఆన్ కూడా ఆడిన కివీస్ చివరకు విజేతగా నిలవడం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్ను పంచిపెట్టింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కమ్బ్యాక్స్లో ఇదొకటని అందరూ కితాబిస్తున్నారు. అదే సమయంలో బాజ్బాల్ బొక్కబోర్లా పడిందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications












