
ముంబై: విరాట్ కోహ్లీ తన సారథ్య భారాన్ని రోహిత్ శర్మతో పంచుకుంటే బాగుంటుందని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మోరె అభిప్రాయపడ్డారు. ఏడాది మొత్తం కోహ్లీ ఒక్కడే బాధ్యతలను మోస్తున్నాడని ఆయన అన్నారు. ఒక జట్టు, ఇద్దరు కెప్టెన్ల అంశంపై కిరణ్ మోరె స్పందించి పైవిధంగా పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీనే కెప్టెన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు.
'ఒక జట్టు, ఇద్దరు కెప్టెన్ల అంశం గురించి ఆలోచించాలి. విరాట్ కోహ్లీ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో, ఆర్సీబీకి ఏడాది మొత్తం సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి దొరకడం లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. విరాట్కు విశ్రాంతినిచ్చినప్పుడు జట్టు బాధ్యతలూ తీసుకుంటున్నాడు. రోహిత్ బాగా పనిచేస్తున్నాడు. అతనుండటం కోహ్లీకి మంచిది. రోహిత్తో కోహ్లీ సారథ్య భారాన్ని పంచుకోవాలి' అని మోరె అన్నారు.
'2008లో విరాట్ కోహ్లీని చూసినప్పుడే సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు చేస్తాడని నాకు అనిపించింది. అండర్-19 ప్రపంచకప్లో అతడు అన్ని మ్యాచులూ గెలిచేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అతనో సూపర్స్టార్' అని మాజీ క్రికెటర్ మోరె ప్రశంసించారు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీసులు.. ఆసియాకప్, నిదహాస్ టోర్నీల్లో రోహిత్ జట్టును విజయవంతంగా నడిపించిన విషయం తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై కిరణ్ మోరె స్పదించారు. 'మహీ క్రికెట్ ఆడడం కష్టం. కానీ నిర్ణయం అతనిదే. అతని నిర్ణయాన్ని గౌరవించాలి. మనస్సులో ఆడాలనే ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అయితే ఐపీఎల్కి ముందు నేను అతన్ని నెట్స్లో చూశాను..చాలా ఫిట్గా ఉన్నాడు. టెన్నిస్ ఆటలో 34, 39 సంవత్సరాల ఆటగాళ్లు టాప్లో ఉన్నారు. ఇక్కడ కూడా క్రమశిక్షణతో ఉండి.. మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటే మళ్లీ క్రికెట్ ఆడొచ్చు. అశీశ్ నెహ్రా కూడా అలానే చేశాడు' అని కిరణ్ మెరే పేర్కొన్నారు.