న్యూయార్క్: భారత మాజీ వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కిరణ్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. చాన్నాళ్ల తరువాత క్రికెట్ ప్రపంచంలో ఆయన పేరు వినిపిస్తోంది. బేస్బాల్, టెన్నిస్ క్రీడల్లో పెట్టింది పేరైన అమెరికాలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది క్రికెట్. అక్కడ క్రికెట్ జట్టు కూడా సిద్ధమైంది. ఈ జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరించబోతున్నారు కిరణ్ మోరే. ఈ మేరకు అమెరికా క్రికెట్ జట్టు బోర్డు యాజమాన్యం ఆయనతో కాంట్రాక్ట్ను కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఈ జట్టు కోచ్గా శ్రీలంకకు చెందిన పబుడు దస్సనాయకే పనిచేస్తున్నారు. ఆయన కాంట్రాక్ట్ కాల పరిమితి ఈ ఏడాది మార్చి నాటికే ముగిసింది. అనివార్య కారణాల వల్ల ఆయన కాంట్రాక్ట్ కాలాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది యూఎస్ఎ క్రికెట్ బోర్డు. బోర్డు యాజమాన్యంలో తలెత్తిన విభేదాల కారణంగా దస్సనాయకే కోచ్ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నారు. డిసెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ.. తన కోచ్ పదవికి రాజీనామా చేశారు.
దీనితో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టిన యూఎస్ఎ క్రికెట్ బోర్డు యాజమాన్యం.. కిరణ్ మోరేను ఎంపిక చేసింది. చాలాకాలంగా క్రికెట్కు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా వెలుగులోకి వచ్చారు. ముంబై ఇండియన్స్కు సేవలను అందిస్తున్నారు. కీపింగ్ కన్సల్టెంట్ కోచ్గా ఉన్నారు. కిరణ్మోరేతో పాటు టీమిండియా మజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే, సునీల్ జోషి, వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోవెల్, ఆస్ట్రేలియా బిగ్బాష్ ఆటగాడు డేవిడ్ సాకెర్ వంటి ఆటగాళ్లు యుఎస్ఏ జట్టుకు సేవలను అందించబోతున్నారు.