కేవలం 24 మందికే అనుమతి:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫ్రాంఛైజీలకి బీసీసీఐ జారీ చేసిన విధివిధానాలలో ప్రధానమైనది.. జట్టులోని క్రికెటర్ల సంఖ్య 24కి కుదించడం. అంటే..యూఏఈకి ఆగస్టు 20 తర్వాత అన్ని ఫ్రాంఛైజీలు కేవలం 24 మందితో కూడిన జట్టుతోనే వెళ్లాలి. దీంతో టోర్నీలోని సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఈ మూడు జట్లు మాత్రమే 25 మందితో జట్టుని ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఈ మూడు జట్లు ఏ క్రికెటర్ని తప్పిస్తాయో? చూడాలి. బహుశా చిన్నస్థాయి ఆటగాడిపై వేటుపడే అవకాశం ఉంది.
6 రోజుల క్వారంటైన్:
యూఏఈలో 6 రోజుల క్వారంటైన్లో ఉండాలని ఐపీఎల్ పాలక మండలి తమ సమావేశంలో నిర్ణయించింది. అయితే డాక్టర్ల సలహాలు, సూచనలతో కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. తాజాగా దుబాయ్ చేరుకున్నాక ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అంగీకరించాయి. ఐపీఎల్ జట్టు యజమానుల సమావేశంలో దీనిపై అన్ని ఫ్రాంఛైజీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 'ఆరోగ్య సమస్యలపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేం. జట్టు సభ్యులందరూ తప్పనిసరిగా ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు' అని ఐపీఎల్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలిపారు.
ఫైవ్ స్టార్ హోటళ్లు కాదు:
ఐపీఎల్ 2020లో ఆడేందుకు సిద్ధమవుతున్నా.. క్రికెటర్లలో వైరస్ భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు. మునిపటిలా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. ఎందుకంటే హోటల్ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్ కండిషనింగ్ డక్ట్ల ద్వారా వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది. ఇక పెద్ద సంఖ్యలో పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాయి. రిసార్ట్, అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకునే పనిలో ఉన్నాయని సమాచారం.
కుటుంబ సభ్యులకు అనుమతి:
ఆటగాళ్ల భద్రతకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాంచైజీలకు బీసీసీఐ సూచిస్తూనే.. క్రికెటర్లతో ఫ్యామిలీ మెంబర్స్ ఉంచడం మీ ఇష్టమని తేల్చి చెప్పేసింది. ఐపీఎల్ 2020 సీజన్ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుండగా.. ఆటగాళ్లతో కలిసి ఉండేవారందరూ తప్పనిసరిగా బబుల్ రూల్స్ని ఫాలో అవ్వాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
కోహ్లీ పర్ఫెక్ట్ ఫిజిక్.. యాబ్స్ను చూసి అందరూ ఫిదా (వీడియో)