ఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఐపీఎల్ ప్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అడుగుపెట్టనుంది. సీపీఎల్లోని సెయింట్ లూసియా జూక్స్ జట్టును త్వరలో పంజాబ్ సొంతం చేసుకోనుంది. ఈ విషయాన్ని పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒప్పందం చేసుకోడానికి తమ సహచర యజమాని మోహిత్ బర్మన్ అక్కడికి వెళ్లినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
కోహ్లీకి అనుష్క దూరం.. ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టు!!
'సీపీఎల్లో భాగస్వామ్యం అయ్యేందుకు త్వరలోనే ఒప్పందం చేసుకోబోతున్నాం. సెంట్ లూసియా జట్టును కొనుగోలు చేయనున్నాం. బీసీసీఐ అనుమతి పొందాక ఇతర విషయాలను వెల్లడిస్తాం. ఒప్పందంపై సంతకం చేయడానికి మోహిత్ బర్మన్ కరీబియన్లోనే ఉన్నారు' అని వాడియా అన్నారు. ఈ సందర్భంగా సెంట్ లూసియా ప్రధాని అలెన్ చస్టానెట్, పర్యాటక శాఖ మంత్రి డొమినిక్ ఫిడ్డెకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
సీపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తర్వాత ఫ్రాంఛైజీగా మారనున్న రెండో ఐపీఎల్ జట్టుగా పంజాబ్ అవతరించనుంది. 2015లో ట్రిన్బాగో నైట్రైడర్స్ను కేకేఆర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీపీఎల్లో ట్రిన్బాగోనే అత్యంత విజయంతంమైన జట్టు. ఇప్పటికీ మూడు టైటిళ్లను కైవసం చేసుకుంది. విండీస్ స్టార్ ఆటగాడు డ్వేన్ బ్రేవో ట్రిన్బాగో జట్టుకు కెప్టెన్. గత సీజన్ జరిగే సమయంలో కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ అక్కడికి వెళ్లి సందడి చేసాడు.
2013లో ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి సీపీఎల్లో ఆరు జట్లు ఉన్నాయి. సెయింట్ లూసియా జట్టుకు వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సమీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2016లో నాలుగో స్థానంలో నిలవడమే ఆ జట్టు ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శన.
సీపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీట్ రసెల్ మాట్లాడుతూ... 'పంజాబ్ యాజమాన్యం సీపీఎల్లోకి రావడం సంతోషంగా ఉంది. పంజాబ్ కోసం ఎదురుచూస్తున్నాం. కొత్త యాజమాన్యం నేతృత్వంలో సెంట్ లూసియా మంచి విజయాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. సీపీఎల్ 2020 ఎనిమిదవ సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరగనుంది' అని అన్నారు.