
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బృందం త్వరలో ఆరంభంకానున్న 2020 సీజన్ కోసం గురువారం యూఏఈకి బయలుదేరింది. ఈ విషయాన్ని పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఉండగా తీసిన ఫొటోను షమీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. 'ఇంతకుముందే దుబాయ్ బయలుదేరాం' అని కాప్షన్ పెట్టాడు. ఆటగాళ్లు అందరూ మాస్కులు ధరించి విమానంలో కూర్చున్నారు. యూఏఈకి వెళ్తున్న తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది.
ఐపీఎల్ 2020 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ రోజు యూఏఈకి బయలుదేరనుంది. ఆటగాళ్ళు యూఏఈకి బయలుదేరడానికి సిద్ధమవుతున్న చిత్రాలను రాజస్థాన్ ప్రాంచైజీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'యూఏఈ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు' అని రాజస్థాన్ కామెంట్ పెట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తర్వాత రాజస్థాన్ రాయల్స్ యూఏఈలో అడుగుపెట్టనుంది. దుబాయ్కు వెళ్లే 24 గంటల ముందు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరికీ రెండుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు అన్ని ప్రాంఛైజీలు చేసిన విషయం తెలిసిందే.
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆగస్టు 21న యూఏఈ బయలుదేరుతున్నట్లు ధృవీకరించారు. రేపు చెన్నై బృందం ప్రత్యేక విమానంలో వెళ్లనుంది. సీఎస్కే వెటరన్ ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై ఆటగాళ్లతో కలిసి శుక్రవారం దుబాయ్ వెళ్లడం లేదు. తన తల్లి అనారోగ్యం కారణంగా హర్భజన్ ఆటగాళ్లతో కలిసి శుక్రవారం ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాడు. హర్భజన్ తన తల్లి ఆరోగ్యం కుదుటపడ్డాక.. రెండు వారల తర్వాత యూఏఈ వెళ్లనున్నాడట. ఇప్పటికే తన తల్లి అనారోగ్యం కారణంగా.. చెన్నై ప్రాంచైజీ ఏర్పాటు చేసిన ఐదు రోజుల స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ క్యాంప్కు కూడా దూరమయ్యాడు.
యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు లీగ్ నిర్వహిస్తున్నారు. వారాంతంలో కాకుండా.. వారం మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరగడం లీగ్ చరిత్రలో ఇదే తొలిసారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరిగేలా బీసీసీఐ షెడ్యూల్ చేసింది.