ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరో స్థానంతో ముగించిన సంగతి తెలిసిందే. తొలుత విజయాలు అందుకున్న పంజాబ్.. ఆ తరువాత వరుస పరాయలతో సతమతమైంది. లీగ్ సగం ముగిశాక వరుస ఐదు విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. అయితే మళ్లీ పరాజయాలు వెంటాడడంతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. పంజాబ్ తరఫున కొందరు ఆటగాళ్లు సక్సెస్ అయితే.. మరికొందరు దారుణంగా విఫలమయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది.
ఐపీఎల్ 2020లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. మరోవైపు 2021 ఐపీఎల్కు కూడా కెప్టెన్గా కేఎల్ రాహుల్, ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగించే అవకాశముంది. తొలిసారి పంజాబ్కు నాయకత్వం వహించిన రాహుల్ బ్యాట్తో అద్భుతంగా రాణించాడు. 55.83 సగటుతో 670 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను రాహుల్ గెల్చుకున్నాడు.
పంజాబ్ కోచ్గా తనకు తొలి ఏడాదే అయినా.. జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పనితీరుపై పంజాబ్ యాజమాన్యం సంతృప్తితోనే ఉంది. 2021 ఐపీఎల్కు ప్రధాన కోచ్గా కుంబ్లేను కొనసాగించే అవకాశముంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మ్యాక్స్వెల్ ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 15.42. ఇక కాట్రెల్ 6 మ్యాచ్ల్లో 8.80 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మొహమ్మద్ షమీ, క్రిస్ గేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లను పంజాబ్ యాజమాన్యం కొనసాగించే వీలుంది. వచ్చే ఏడాది కొత్త జట్టు రానున్న నేపథ్యంలో భారీ వేలం జరుగనుంది. అందుకే మిడిల్ ఆర్డర్ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది పంజాబ్. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది.
IPL 2021లో మరో కొత్త జట్టు.. కార్పొరేట్ దిగ్గజం సిద్ధం!! భారీ వేలానికి బీసీసీఐ కసరత్తులు!