
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా అంత్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కోహ్లీకి తన ట్విట్టర్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది.
ఐసీసీ చేసిన ట్వీట్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసిన క్రికెటర్... టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక డబుల్ సెంచరీలు... ఐసీసీ అవార్డులను క్లీన్ స్వీప్ చేశావంటూ ట్వీట్లో పేర్కొంది. తన పుట్టినరోజుని జరుపుకునేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ పర్యటనలో ఉన్నాడు.
పుట్టినరోజు నాడు భూటాన్ను పర్యటనకు ఎందుకు వెళ్లామనే విషయాన్ని సైతం అనుష్క శర్మ తన ఇనిస్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. స్వచ్ఛమైన మానవ సంబంధాలను మేం ఇష్టపడుతామని... ట్రెక్కింగ్ సమయంలో ఓ భూటాన్ కుటుంబంతో గడిపిన విషయాన్ని అనుష్క శర్మ వెల్లడించింది.
ఈ సందర్భంగా "మా సెలబ్రిటీ స్టేటస్ గురించి వారికి తెలియకపోయినా.. వారు మాత్రం మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు" అని అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. పుట్టినరోజు నాడు విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కోహ్లీ తన పుట్టినరోజు నాడు తన ట్విట్టర్లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు. చిన్నతనంలో తన గురించి తాను రాసుకున్న లేఖను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నాళ్ల తన జర్నీ, తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆ లేఖలో రాశాడు. కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానని అందులో రాసుకొచ్చాడు.