ముంబయి ఇండియన్స్లో అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబయి జట్టు బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ తాజాగా పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయిదు టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. ముంబయి ఇండియన్స్ పేజీ ఫాలోవర్స్ లక్షలలో కూడా తగ్గిపోయారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా హార్ట్ బ్రేక్ సింబల్తో రోహిత్కు సపోర్ట్ ఇచ్చాడు.

అయితే తాజాగా పొలార్డ్ ఇన్స్టాగ్రామ్లో విధేయత గురించి స్టోరీ పోస్ట్ చేశాడు. ''వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుంది. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుంది'' అని పొలార్డ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట్లో వైరల్గా మారింది. ముంబయి ఇండియన్స్ను ఉద్దేశించి పొలార్డ్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు భావిస్తున్నారు.

కాగా, కెప్టెన్సీ హామీతోనే హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబయి ఇండియన్స్కు తిరిగొచ్చాడంటూ వార్తలు కూడా వచ్చాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో జట్టును నడిపించిన హార్దిక్ గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్స్కు నడిపించాడు. అంతేగాక 2022 సీజన్లో జట్టును విజేతగా నిలిపాడు. మరోవైపు గుజరాత్ కోసం ముంబయి ఏకంగా సుమారు రూ.100 కోట్లు వెచ్చించదని సమాచారం.
అయితే వచ్చే ఏడాది మెగా ఐపీఎల్ వేలం ఉన్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మెగా ఐపీఎల్ వేలానికి ముందు ప్రతిజట్టు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకనే అవకాశం ఉంటుంది. అందులో ఒక విదేశీ ప్లేయర్కు అవకాశం ఉంటుంది. మరోవైపు 36 ఏళ్ల రోహిత్ కెరీర్ భవితవ్యంను కూడా దృష్టిలో పెట్టుకొని హార్దిక్కు బాధ్యతలు అందించారని విశ్లేషిస్తున్నారు.