హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చవద్దని భారత్ ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్ టైటిళ్లను నెగ్గడంతో శ్రీకాంత్ ఒక్కసారిగా సూపర్ స్టార్గా మారిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో బ్యాడ్మింటన్ అభిమానులు శ్రీకాంత్ని కోహ్లీతో పోల్చడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోహ్లీతో తనని పోల్చవద్దని కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. 'నన్ను నేను వేరే ఎవరితోనూ పోల్చుకోను. ఆయా క్రీడల్లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారు' అని చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ నిరాశ పరచడంతో అభిమానులు అతనిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోహ్లీకి శ్రీకాంత్ బాసటగా నిలిచాడు. కోహ్లీ కూడా మానవమాత్రుడేనని, ప్రతీసారి పరుగులు చేసేందుకు అతను యంత్రం కాదని అన్నాడు.
జూన్ 25 (ఆదివారం) జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో వరుస గేముల్లో ఒలింపిక్ చాంపియన్ చెన్లాంగ్పై విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్కు కెరీర్లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం.
అలాగే వరుసగా మూడు సూపర్ సిరీస్ (సింగపూర్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్) ఫైనల్స్ ఆడిన ఐదో క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన శ్రీకాంత్పై ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
శ్రీకాంత్కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నజరానా ప్రకటించగా, వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్తో సగటు భారతీయుడు గర్వపడేలా చేసిన శ్రీకాంత్కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ కంపెనీకి చెందిన టీయూవీ 300 కారును బహుమతిగా ఇస్తామని తెలిపారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా శ్రీకాంత్కు భారీ నజరానా ప్రకటించింది. శ్రీకాంత్ కు వెయ్యి గజాల స్థలం రూ.50 లక్షల నగదును ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గ్రూప్1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపిచంద్ కు రూ. 15 లక్షల బహుమతిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.