
హైదరాబాద్: టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో వెస్టిండిస్ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ వికెట్ తీసిన ఆనందంలో ఖలీల్ అహ్మద్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు.
వికెట్ తీసిన ఆనందంలో పెద్దగా అరుస్తూ హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు పెవిలియన్కి వెళ్తున్న శామ్యూల్స్ని సమీపించి గట్టిగా అరవడాన్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ అతడు ఐసీసీ కోడ్ ఆఫ్ కండెక్ట్ కింద లెవల్ -1 తప్పిదానికి పాల్పడినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇందులో భాగంగా హెచ్చరికతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ని కూడా చేర్చింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ నాలుగో బంతిని ఆఫ్ స్టంప్కి వెలుపలగా సంధించగా, క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్ దానిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు.
కొద్దిగా స్వింగ్ అయిన బంతి బ్యాట్ అంచున తాకి నేరుగా స్లిప్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఎలాంటి తడబాటు లేకుండా బంతిని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ పెద్దగా అరుస్తూ హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్లో మొత్తం 5 ఓవర్లు వేసిన ఖలీల్ అహ్మద్ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలు సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
నాలుగో వన్డేలో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.