
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా జట్టు ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు టెస్టుల్లో భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు.. ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ ఆష్టన్ అగర్.. జాతీయ జట్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో జరుగుతున్న దేశవాళీలు ఆడేందుకు అనుమతి తీసుకొని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
భారత్తో టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా సెలెక్టర్లు మొత్తం 18 మంది సభ్యుల బృందాన్ని పంపించారు. వీరిలో ఆష్టన్ అగర్ కూడా ఉన్నాడు. లియాన్ తర్వాత ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్గా అగర్ ఎదిగాడు. కానీ భారత్తో టెస్టుల్లో అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. దానికితోడు దేశవాళీల్లో కూడా అంత అనుభవం లేని టాడ్ మర్ఫీని తొలి టెస్టులో ఆడించింది టీం మేనేజ్మెంట్. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచులో కునెమన్కు అవకాశం కల్పించింది. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఇటీవల ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇది కచ్చితంగా అగర్ను అవమానించడమే అని తేల్చేశాడు. ఈ క్రమంలోనే అతను షెఫీల్డ్ షీల్డ్ గేమ్స్ ఆడుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీని కోసం భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా బృందం నుంచి అగర్ తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ అగర్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే అతను దేశవాళీలు ఆడుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతను స్వదేశం వెళ్లిపోయాడు. మార్చి 2న జరిగే మ్యాచ్లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున అగర్ ఆడుతున్నట్లు సమాచారం.