టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. పది రోజుల్లో శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మెగాటోర్నీలో గెలిచిన అనంతరం భారత్కు ఇది రెండో పర్యటన అయినప్పటికీ.. సీనియర్లు బరిలోకి దిగుతున్న మొదటి సిరీస్ ఇదే. జింబాబ్వే పర్యటనకు శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే శ్రీలంక సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లక్ష్యంగా రోడ్ మ్యాప్ను లంక సిరీస్తోనే ప్రారంభించనుంది. అంతేగాక నయా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే కోచ్ బాధ్యతలు చేపట్టనుండటం; స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టిఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. లంక పర్యటనకు భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ గౌతమ్ గంభీర్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో జట్టు ఎలా ఉండాలో గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఎలాంటి ఆటగాళ్లను తాను కోరుకుంటాడో వివరించాడు. భయం లేని క్రికెటర్లను ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. జట్టుకు అవసరమయ్యే స్థానాల్లో సహజసిద్ధంగా ఆడేవాళ్లను సెలక్ట్ చేస్తానని గంభీర్ పేర్కొన్నాడు. హిట్టర్లతోనే జట్టు కూర్పును చేయలేమని ఇన్నింగ్స్ ఇరుసులా మారుతూ యాంకరింగ్ బ్యాటింగ్ చేసే వాళ్లు కావాలని తెలిపాడు.
''భయం లేని ఆటగాళ్లను ఎంచుకోవాలి. అలాగే 50 ఓవర్ల ఫార్మాట్కు సరిపోయే ప్లేయర్లను తీసుకోవాలి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడే వాళ్లతో పాటు హిట్టర్లతో అన్ని రకాల ఆటగాళ్లు జట్టులో ఉండాలి. రూల్స్ జట్టుకూర్పులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గంతో ఒకే కొత్త బంతితో ఆడే వాళ్లం. కానీ ఇప్పుడు రెండు కొత్త బంతులు వాడాల్సి ఉంది. అయిదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉండాలి. దీంతో పార్ట్ టైమ్ బౌలర్ అవసరం తగ్గిపోయింది''
''అంతేగాక రివర్స్ స్వింగ్ను ఎక్కువగా చూడలేకపోతున్నాం. అలాగే ఫింగర్ స్పిన్నర్ల ఆటను కోల్పోతున్నాం. ఈ పరిస్థితుల్లో తమ బాధ్యతలను సులువుగా అర్థం చేసుకుండా, సహజసిద్ధంగా ఆడే ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి 15 మందిని ఎంపిక చేయాలి'' అని గౌతమ్ గంభీర్ అన్నాడు. కాగా, శ్రీలంక పర్యటనకు భారత జట్టును రేపటి లోపు ప్రకటించే అవకాశం ఉంది.