
ఐపీఎల్లో ఆడడంపై ఇంగ్లండ్ టెస్టు టీం కెప్టెన్ జట్టు జోరూట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఐపీఎల్లో పాల్గొనడంపైనే ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఐపీఎల్ వేలానికి సంబంధించిన సమయం కూడా దగ్గర పడుతుందన్నాడు. అంతేకాకుండా వేలంలో పాల్గొనడానికి పేరు ఇవ్వాల్సిన సమయం సైతం దగ్గర్లోనే ఉందని తెలిపాడు.
తాను ఐపీఎల్లో ఆడడం వల్ల అది తన టెస్ట్ క్రికెట్ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తేనే ఆడతానని రూట్ స్పష్టం చేశాడు. తన టెస్టు క్రికెట్కు ఎలాంటి ఇబ్బంది లేకుంటే కచ్చితంగా ఆడతానని తెలిపాడు. అలా కాకుండా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ ఆడనని చెప్పాడు. తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ కూడా ఇంగ్లండ్కు ఆడడానికే ఉంటుందని ఈ సందర్భంగా రూట్ వెల్లడించాడు. కాగా జో రూట్ ఈ సారి ఐపీఎల్లో ఆడనున్నాడని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా రూట్ ఐపీఎల్లో ఆడలేదు. అంతేకాకుండా ఐపీఎల్ వంటి కమర్షియల్ లీగ్ల కోసం కాకుండా తన జాతీయ జట్టుకు ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్న రూట్పై అంతట ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం యాషెస్ సిరీస్లో బిజీగా ఉన్న రూట్ తన కెరీర్లో 113 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 49 సగటుతో 9555 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 5 సార్లు డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 254. ఈ క్రమంలో 1065 సిక్స్లు, 23 ఫోర్లు బాదాడు. ఇక 152 వన్డే మ్యాచ్లు ఆడి 51 సగటుతో అందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 133. ఈ క్రమంలో 491 ఫోర్లు, 44 సిక్స్లు బాదాడు. ఇక 32 టీ20 మ్యాచ్లు ఆడి 35 సగటుతో 893 పరుగులు చేశాడు. 5 హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోర్ 90 పరుగులు. ఈ క్రమంలో 92 ఫోర్లు, 16 సిక్స్లు బాదాడు.