లండన్: ఆస్ట్రేలియా గడ్డపై చివరి టెస్టులో సంచలన విజయాన్ని నమోదు చేసి సంబరాలు చేసుకుంటున్న టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవద్దని, త్వరలోనే ఇంగ్లండ్ జట్టు ఇండియాకు వస్తుందన్నాడు. అయితే పీటర్సన్ చేసిన ట్వీట్ హిందీలో ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఇంగ్లండ్ టీమ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో కేపీ ఇలా సరదాగా ట్వీట్ చేశాడు.
'టీమిండియా.. ఆస్ట్రేలియాపై గెలిచిన చారిత్రక విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే.. ఇది ఎన్నో అడ్డంకుల మధ్య సాధించిన విజయం. అయితే అసలు సవాలు మీకు కొన్ని వారాల్లో ఎదురు కాబోతోంది. ఇంగ్లండ్ జట్టు భారత్ వస్తోంది. ఇంగీష్ టీమ్ను మీ సొంతగడ్డపై ఓడించాల్సి ఉంటుంది. జర జాగ్రత్త.. ఈ రెండు వారాల్లో మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవద్దు' అని కెవిన్ పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
India 🇮🇳 - yeh aitihaasik jeet ka jashn manaye kyuki yeh sabhi baadhao ke khilaap hasil hui hai
— Kevin Pietersen🦏 (@KP24) January 19, 2021
LEKIN , ASLI TEAM 🏴 😉 toh kuch hafto baad a rahi hai jisse aapko harana hoga apne ghar mein .
Satark rahe , 2 saptaah mein bahut adhik jashn manaane se saavadhaan rahen 😉
2013-14 యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు.
భారత పర్యటనలో నాలుగు టెస్ట్లు, ఐదు టీ20లు, మూడు వన్డేలను ఇంగ్లండ్ ఆడనుంది. తొలి టెస్ట్ ఫిబ్రవరి 5న చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్ల కోసం బీసీసీఐ టీమ్ను ప్రకటించింది. ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ వహించనుండగా.. హార్దిక పాండ్యా, ఇషాంత్ శర్మ తిరిగి టీమ్లోకి వచ్చారు. పేసర్ నటరాజన్ను తప్పించిన సెలెక్టర్లు.. ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ను జట్టుకు ఎంపిక చేశారు. డ కండరాల గాయంతో ఆటకు దూరమైన హనుమ విహారిని జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ను స్టాండ్బై ఆటగాడిగా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్ట్లు చెన్నైలో, ఆ తర్వాతి రెండు టెస్టులు, టీ20లు అహ్మదాబాద్లోని మొతేరాలో, మూడు వన్డేలు పుణెలో జరగనున్నాయి.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చేటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.
'భారత్ నెట్ బౌలర్లతో ఆడి విజయం సాధించడం నమ్మలేకపోతున్నా.. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా'