
జోహన్స్బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్కు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఓ సలహా ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ప్రధాన కోచ్గా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ బాధ్యతలు చేపట్టాలన్నాడు. గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పూర్తిగా బలహీనంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు దూరమవ్వడం, సరైన ఆటగాళ్లు జట్టుకు దొరకకపోవడం, సమర్ధ బోర్డు మెంబెర్స్ లేకపోవడంతో పోరాట పటిమ చూపలేకపోతుంది.
ఇటీవల జరిగిన ప్రపంచకప్లో, ఆ తర్వాత భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు పేలవ ప్రదర్శన చేసి ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. జట్టు బలహీనంగా మారడంతో దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ట్విట్టర్ వేదికగా ఓ సలహా ఇచ్చాడు. నేను దక్షిణాఫ్రికా జట్టు సమస్యలను పరిష్కరిస్తా అని ఓ ట్వీట్ చేసాడు.
దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, హెడ్ కోచ్గా వికెట్ కీపర్ మార్క్ బౌచర్, బౌలింగ్ కోచ్గా పేసర్ మఖాయ ఎన్తినీ, స్పిన్ కోచ్గా ఆల్రౌండర్ రాబిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా క్రికెట్ సీఈవో మరియు జట్టు కన్సల్టెంట్గా ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ బాధ్యతలు చేపట్టాలని పీటర్సన్ ట్వీట్ చేయాడు. వీరందరూ బాధ్యతలు చేపడితే దక్షిణాఫ్రికా క్రికెట్ పూర్వవైభవాన్ని అందుకుంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
స్మిత్, ఎన్తినీ, బౌచర్, కలిస్ అందరు పీటర్సన్తో ఆడిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పరిపాలన సమస్యలు ఎదుర్కొంటుంది. జట్టు స్పాన్సర్ 'స్టాండర్డ్ బ్యాంక్' తమ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకోలేమని ఇటీవలే తేల్చేసింది. ప్రపంచకప్ అనంతరం దిగ్గజాలు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాంచీ టెస్ట్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 11 సంవత్సరాలలో దక్షిణాఫ్రికా జట్టును ఫాలోఆన్ ఆడించిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.