
లండన్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఏదైనా కారణం చేత అందుబాటులో లేకుంటే వికెట్కీపర్ జోస్ బట్లర్కు జట్టు పగ్గాలందించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సూచించాడు. బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ కెప్టెన్గా ఉండాలని పీటర్సన్ భావించడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్సీ ఆల్రౌండర్ స్టోక్స్పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందన్నాడు. కెప్టెన్ రూట్ భార్య జులైలో ప్రసవించనుంది. జులైలోనే వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వబోతున్నది.
భార్య ప్రసవం కారణంగా మూడు టెస్టులలో ఒకదాన్ని జో రూట్ ఆడకపోవచ్చు. ఒకవేళ తాను అందుబాటులో లేకుంటే.. కెప్టెన్సీ బాధ్యతలు వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఇవ్వాలని రూట్ మద్దతు ఇచ్చాడు. అయితే రూట్ వ్యాఖ్యలపై కెవిన్ పీటర్సన్ స్పందించాడు. 'ఇప్పుడున్న స్టోక్స్ ఆటతీరులో ఎటువంటి మార్పులు రావడం నాకిష్టం లేదు. అందుకే నేనైతే కెప్టెన్సీ బాధ్యతలను బట్లర్కు అప్పగిస్తా. అతడు కెప్టెన్సీ బాగా చేయగలడు' అని పీటర్సన్ చెప్పాడు. దీంతో రూట్ లేనప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికివ్వాలనే అంశంపై ఇంగ్లండ్ క్రికెట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్న వెస్టిండీస్ జట్టుకి సోమవారం కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికి కరోనా నెగటివ్ అని తేలింది. జులై 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. కనీసం మూడు వారాల ముందు విండీస్ జట్టును పంపాలని ఈసీబీ సూచించింది. దాంతో గతవారం 14 మందితో కూడిన జట్టుని ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. ప్రయాణానికి ముందు వారికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. ఆపై సాయత్రం రెండు చార్టెడ్ విమానాల్లో జట్టు బయలుదేరింది.
మూడు టెస్టుల సిరీస్ పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. ఇందుకోసం ఈసీబీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంగ్లండ్ గడ్డపైకి అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల పాటు విండీస్ జట్టు క్వారంటైన్లో ఉండనుంది. జులై 8 నుంచి 12 వరకూ హోంప్షైర్లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. జులై 16 నుంచి 20 మధ్య రెండో టెస్టు, 24 నుంచి 28 వరకూ మూడో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనున్నాయి.
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. ఇక 37 టీ20ల్లో 1,176 రన్స్ బాదాడు. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ సందర్భంగా పలువురు ఆటగాళ్లను కేపీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.