
కొంత కాలం క్రితం వరకూ ఫామ్లో లేక ఇబ్బందులు పడిన విరాట్ కోహ్లీ.. గతేడాది చిన్న బ్రేక్ తీసుకున్నాడో లేదో మళ్లీ చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆటతీరు గురించి చాలా మంది మాజీలు రకరకాల కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా పెదవి విప్పాడు. కోహ్లీ ఫామ్లో లేనప్పుడు తను అతనితో మాట్లాడానని పీటర్సన్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే కోహ్లీతో తను ఏం మాట్లాడాడో కూడా వెల్లడించాడు.
కోహ్లీ ఆటతీరు, అతని సెలబ్రేషన్స్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుందని పీటర్సన్ చెప్పాడు. కోహ్లీ ఒక ఎంటర్టైనర్ అని, అలాంటి అతనిపై కరోనా చాలా ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చాడు. 'విరాట్ నాకు చాలా కాలంగా తెలుసు. అతను ఆడే విధానం చాలా ప్యాషనేట్గా ఉంటుంది. అతని ఆటతీరులో చాలా ఎమోషన్ ఉంటుంది. అతనిపై కరోనా చాలా ప్రభావం చూపించిందని నేను అనుకుంటున్నా' అని పీటర్సన్ తెలిపాడు.
అలాంటి సమయంలోనే కోహ్లీని తను కలిసినట్లు పీటర్సన్ గుర్తుచేసుకున్నాడు. 'జస్ట్ చిల్ డ్యూడ్.. ఇది కోవిడ్ టైం. నువ్వు ఒక ఎంటర్టైనర్వి. స్టేడియంలో ముగ్గురు మనుషులు, వాళ్ల కుక్క మాత్రమే ఉంటే నువ్వు ఆడటం కష్టం. సరిగా ఆడలేవు.' అని పీటర్సన్ చెప్పాడట. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారాయి. గతేడాది కొంత బ్రేక్ తీసుకున్న కోహ్లీ చాలా బలంగా పునరాగమనం చేశాడు. వరుసగా మూడు ఫార్మాట్లలో సెంచరీలతో ఆకట్టుకున్నాడు.
ఇంత చేసినా కూడా తను పూర్తిగా బెస్ట్ ఫామ్ అందుకోలేదని కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్లో ఆ ఫామ్ అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదే విషయం చెప్పిన పీటర్సన్.. 'కోహ్లీ ఆ 75వ సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అతను కొంచెం గాడి తప్పగానే విమర్శలు చేసిన వాళ్లు నా దృష్టిలో ఫూల్స్. కొంత మద్దతుగా నిలిస్తే చాలా బాగుండేది' అని విమర్శించాడు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కోహ్లీ ఫ్యాన్స్, టీం మేనేజ్మెంట్ కోహ్లీకి మద్దతుగా నిలిచి చాలా అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.