హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్లో తాను పాల్గొనాలని అనుకోవడం లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. తన శీతాకాలపు సీజన్ అంతా పుల్ బిజీగా ఉండటం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు.
గతేడాది రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన కెవిన్ పీటర్సన్, నాలుగు మ్యాచ్లు ఆడిన తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. తన నాలుగు ఇన్నింగ్స్ల్లో 36.50 యావరేజితో 73 పరుగులు చేశాడు. దీంతో పీటర్సన్ స్ట్రయిక్ రేటు 119.67గా ఉంది.

అయితే గత డిసెంబర్లో పీటర్సన్ను పుణె సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడాలంటే ఫిబ్రవరి నెలాఖరున జరిగే వేలంలో ఏదొక ప్రాంఛైజీ పీటర్సన్ను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాను ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధంగా లేనని పీటర్సన్ ముందుగానే ప్రకటించాడు.
'ఐపీఎల్ వేలానికి నేను రావాలని అనుకోవడం లేదు. ఈ శీతాకాలపు సీజన్లో అనేక మ్యాచ్లతో బిజీగా ఉన్నా. ఒకవైపు ప్రయాణాలు, మరొకవైపు మ్యాచ్లతో తీరిక లేకుండా ఉన్నట్లు తెలిపాడు. దాంతో వచ్చే వేసవిలో ప్రయాణాలకు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం బిగ్ బాష్ లీగ్లో భాగంగా జరిగిన సెమీ పైనల్స్ మ్యాచ్లో మెల్బోర్న్ స్టార్స్ తరుపున ఆడిన పీటర్సన్ అంపైరింగ్ నిర్ణయంపై గాలిలో వ్యాఖ్యలు చేయడంతో అతడిపై చర్యలకు ఉపక్రమించారు. పెర్త్ స్కాచర్స్ ఆటగాడు సామ్ వైట్ మన్ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి బ్యాట్కు తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనబడింది.
అయితే మెల్ బోర్న్ ఆటగాళ్ల అప్పీల్ ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అదే సమయంలో మైక్రోఫోన్లో బీబీఎల్ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్న పీటర్సన్ అంపైర్ నిర్ణయంపై ధ్వజమెత్తాడు. అది కచ్చింతగా తప్పుడు నిర్ణయమంటూ వేలెత్తి చూపాడు. ఆ బంతి గ్లౌవ్స్కు తాకి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో పీటర్సన్కు మ్యాచ్ రిఫరీ డేవిడ్ తలల్లా 3,824 అమెరికన్ డాలర్ల జరిమానాను విధించారు. ఐసీసీ నిబంధనల్లోని లెవన్-2ను పీటర్సన్ అతిక్రమించడంతో అతనిపై ఐదు వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానా విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.