
శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత వన్డే జట్టును తాము సెకండరీ టీంగా పరిగణించబోమని దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అన్నాడు. ఎందుకంటే భారత్లో చాలా ట్యాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ జట్లను రూపొందించగల కెపాసిటీ టీమిండియాలో ఉందని అతను కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ తొలి వన్డేలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. 'నేను భారత వన్డే జట్టుని రెండో స్థాయి టీంగా అసలు భావించను. భారత జట్టులో చాలా ట్యాలెంట్ ఉంది. ఏకంగా నాలుగైదు వరల్డ్ క్లాస్ టీంలు టీమిండియాకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.' అని కేశవ్ అన్నాడు.
'చాలా మంది ఐపీఎల్లో ఆడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇంకా ఇంటర్నేషనల్ అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. టీమిండియాకు వరల్డ్ క్లాస్ ప్లేయర్లకు కొదవే లేదు. భారత్పై ఆడటం ఎల్లప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. సహజంగానే భారత్ లాంటి టీంతో ఆడాల్సినప్పుడు మనల్ని మనం మరింత సవాల్ చేసుకుంటూ సిద్ధం కావాల్సి ఉంటుంది. ఎందుకుంటే ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్తో భారత జట్టు చాలా భీకరంగా కన్పిస్తుంటుంది' అని మహారాజ్ అన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ T20 బౌలర్గా ఉన్న తబ్రైజ్ షమ్సీని తొలి వన్డేలో భారత బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అతను తాను వేసిన ఎనిమిది ఓవర్లలో ఏకంగా 89పరుగులిచ్చాడు.
అయితే షమ్సీ పేలవ బౌలింగ్ను మహరాజ్ వెనకేసుకొచ్చాడు. 'షమ్సీ నిజంగా పేలవమైన బౌలింగ్ కలిగి ఉన్నాడని నేను అనుకోను. బౌలింగ్ ఎల్లవేళాలా అనుకూలంగా పడాలని ఎవరూ అనుకోకూడదు. గణాంకాలు చూసి కూడా నిర్దిష్ట అభిప్రాయానికి రాకూడదు. భారత బ్యాటర్లు ఒకరి బౌలింగ్లో పరుగులు దండుకోవాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ షమ్సీ బౌలింగ్ వారికి ఆ రోజు కాస్త వీలు చిక్కింది. ఏదేమైనా షమ్సీ ఒకరోజు బాగా ఆడకుంటే తనను తాను సాన బెట్టుకుని తర్వాతి మ్యాచ్లో తానేంటో చూపిస్తాడు.' అని మహారాజ్ పేర్కొన్నాడు. రాంచీలో జరగనున్న రెండో వన్డే కోసం చాలా ఎదురుచూస్తున్నానని.. వీలు చిక్కితే మహేంద్ర సింగ్ ధోనీతో ఓసారి మాట్లాడాడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ధోనీతో కలిసి ఆడే అవకాశం తనకు లేదు కనీసం ఓసారి మాట్లాడే అవకాశమన్న దొరికితే చాలు అని కేశవ్ పేర్కొన్నాడు. కెప్టెన్సీ పరంగా, మైదానంలో అతని ప్రశాంతత పరంగా అతని నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి' అని మహరాజ్ కితాబిచ్చాడు.