హైదరాబాద్: తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ టీమిండియా పేసర్ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు శ్రీశాంత్ ఊరట కలిగించే తీర్పునిచ్చింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి హైకోర్టు నోటీసు పంపింది.
దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ జస్టిస్ పీబీ ఆశ కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలకు నోటీసులు జారీ చేశారు. 2013లో జరిగిన ఐపీఎల్ 6వ ఎడిషన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. దీంతో బీసీసీఐ క్రమశిక్షణ సంఘం శ్రీశాంతపై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా కోర్టు శ్రీశాంత్ను నిర్దోషిగా విడుదల చేసింది. ఇటీవల స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందు ఏప్రిల్లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవడం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో బోర్డు ఎన్ఓసీ ఇవ్వకపోగా అతడిపై విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ క్రమంలో బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో తనపై విధించిన నిషేధం ఎత్తివేసి ఏప్రిల్లో జరిగే స్కాటిష్ క్లబ్ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించాలని బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ శ్రీశాంత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.