కేదార్ జాదవ్ భుజానికి గాయం
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఓవర్త్రోను ఆపేందుకు ఎడమవైపుకి డైవ్ చేసిన కేదార్ జాదవ్ కిందపడటంతో ఎడమ భుజానికి గాయమైంది.
ఐపీఎల్ మొత్తానికి దూరం
దీంతో కేదార్ జాదవ్ ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 34 ఏళ్ల కేదార్ జాదవ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కేవలం బ్యాట్స్మన్గానే కాదు ఆఫ్ స్పిన్నర్గా కూడా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో కేదార్ జాదవ్ మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శన ఇప్పటికీ అభిమానులకు గుర్తే.
అభిమానుల ఆందోళన
ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్కు కేదార్ జాదవ్ దూరం కానున్నాడనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేదార్ జాదవ్ గాయంపై కోచ్ ప్లెమింగ్ మాట్లాడుతూ "జాదవ్కి ఎక్స్రే, స్కానింగ్ చేస్తున్నాం. అతడు త్వరగా కోలుకుంటాడనుకుంటున్నా. ఇకపై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆడతాడని అనుకోవట్లేదు. తన తదుపరి ధ్యాసంతా వరల్డ్కప్పైనే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
వైద్య పరీక్షల అనంతరం పూర్తి సమాచారం
"ప్రస్తుతం కేదార్ జాదవ్ కొంత ఇబ్బందిగానే ఉన్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గురించి కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. చేతి వేళ్లు మడతపడ్డాయి అంతే... ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదు" అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. మరోవైపు సీఎస్కే జట్టులోని ఆటగాడు ఒకరు మాట్లాడుతూ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, జాదవ్ కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని చెప్పాడు.