ముంబై: భారత్లో మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు క్రీడాకారుల విరాళాల పరంపర కొనసాగుతునే ఉంది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, టీ20 స్పెషలిస్ట్ సురేష్ రైనా, పఠాన్ బ్రదర్స్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సాయం చేస్తున్నారు. తాజాగా జాబితాలో మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ కూడా చేరిపోయాడు.
ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఇష్టపడతా: కోహ్లీ
కొవిడ్-19పై పోరు సాగిస్తున్న వైద్య సిబ్బందికి ఉపయోగకరమైన మాస్క్లు అందించడంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కేదార్ జాదవ్ తన వంతు విరాళం అందజేశాడు. అయితే ఎంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని మాత్రం జాదవ్ గోప్యంగా ఉంచాడు. విరాట్ కోహ్లీ కూడా ఎంత విరాళం ఇచ్చాడో చెప్పని విషయం తెలిసిందే. అయితే విరుష్క జోడి 3 కోట్ల రూపాయలు కరోనా కోసం ఇచ్చినట్టు సమాచారం.
'ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సాయం అందించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రి, పగలు అనే తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు. వారు చేసే పోరాటం ముందు మనం చేసే సాయం ఎంత. వైద్యుల కోసం సహకరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నా' అని 35 ఏళ్ల కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. జాదవ్ భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
కరోనాపై పోరాటానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీకృష్ణ ప్రియ తన వంతు సాయాన్ని ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు విరాళమిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన ఆమె ఆట ద్వారా తనకు వచ్చిన ఆదాయాన్ని విరాళంగా అందించింది. 'సామాజిక సేవలో ముందుండే మా అమ్మ నాకు ఆదర్శం. ఈ కఠిన పరిస్థితుల్లో నా ఈ చిన్న సాయం విరాళాలు అందించేలా మరెంతో మంది క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నా' అని ప్రియ పేర్కొంది.