నింపాదిగా బ్యాటింగ్..!
మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే కేదార్ జాదవ్ బౌలింగ్ కూడా చేయగలడు. పార్ట్ టైమ్ స్పిన్నర్గా అతని సేవలను వినియోగించుకుంటోంది టీమ్ మేనేజ్మెంట్. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటిదాకా అతను ఆడిన మ్యాచుల్లో పెద్దగా భారీ స్కోరును నమోదు చేయలేకపోయాడు. ఆప్ఘనిస్తాన్తో మ్యాచ్లో 52 పరుగులు చేసినప్పటికీ..చాలా మందకొడిగా, నింపాదిగా బ్యాటింగ్ చేశాడనే అపవాదును ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో అతని బ్యాటింగ్ శైలిని ఏకి పడేశారు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు. ఏడు మ్యాచ్లో అయిదింట్లో గెలుపొందిన టీమిండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
కనిపించని ఫైర్..
ఆదివారం నాటి ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా కూడా కేదార్ జాదవ్ బ్యాటింగ్లో ఎలాంటి ఫైర్ కనిపించలేదు. దూకుడుతనం కొరవడింది. భారీ షాట్లను ఆడటానికి కూడా అతను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే విమర్శలు అతనిపై ఉన్నాయి. సీనియర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ- కేదార్ జాదవ్ 31 బంతులను ఎదుర్కొని 20 పరుగులే చేశారనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో- కేదార్ జాదవ్కు తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమేనని అంటున్నారు. మంగళవారం ఎడ్జ్బాస్టన్ స్టేడియంలోనే బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అతనికి తుది జట్టులో గనక చోటు దక్కితే ఆశ్చర్యమేనని అంటున్నారు.
ప్రత్యామ్నాయాలేమున్నాయ్?
కేదార్ జాదవ్ను పక్కన పెట్టాల్సి వస్తే.. టీమిండియా ఎదురుగా ప్రస్తుతానికి రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. ఒకటి- ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోవడం, రెండు- పించ్ హిట్టర్ దినేష్ కార్తిక్కు తుది జట్టులో చోటు కల్పించడం. ఈ రెండింట్లో మొదటి ఆప్షన్ వైపే మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. రవీంద్ర జడేజా అటు బ్యాట్తో, ఇటు బంతితో రాణించగలడు. ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించగలడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో రవీంద్ర జడేజా సబ్స్టిట్యూట్గా వచ్చి రెండు అద్భుత క్యాచ్లను అందుకున్నాడు. దీనితోపాటు- ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ల ప్రతాపం ముందు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ సింగ్ తేలిపోయిన నేపథ్యంలో.. మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్గా జడేజాను తీసుకోవడానికే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.