హైదరాబాద్: భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుంది! సెమీ ఫైనల్ 2లో భాగంగా ఈ రెండు జట్లు గురువారం నాడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించనున్నారని తెలుస్తోంది. మార్చి 26వ తేదీన మ్యాచ్ సందర్భంగా అభిమానులు మ్యాచ్ చూసేందుకు అవకాశమశమిస్తున్నారని అంటున్నారు.

రైనా కోసం ఉత్తర ప్రదేశ్లోను...
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బముల్ని గ్రామంలో కూడా సెలవు ప్రకటించారు. ఆ గ్రామంలో గురువారం నాడు దుకాణాలకు, కార్యాలయాలకు ఇలా అన్నింటికి సెలవు ఇచ్చారు. ఇందుకు ఓ కారణం ఉంది. రైనా ఆ ఊరికి కాబోయే అల్లుడు.

ఈ నేపథ్యంలో ఊరికి కాబోయే అల్లుడి పైన తమకున్న అభిమానాన్ని గ్రామస్థులు ఇలా చూపిస్తున్నారు. బాల్య స్నేహితురాలు, ఆ గ్రామానికి చెందిన ప్రియాంక చౌధరితో రైనాకు వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. దీంతో ఆ గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. భారత జట్టు ప్రపంచ కప్ గెలవాలని గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేస్తున్నారు. రేపటి మ్యాచ్ కోసం గ్రామంలో భారీ తెరలు ఏర్పాటు చేశారు.