Sanju Samson: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) గట్టి షాకిచ్చింది. సంజూ శాంసన్ విషయంలో అనవసర ఆరోపణలు చేసినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకుంది. అతడిపై మూడేళ్ల పాటు వేటు వేసింది. అసలేం జరిగిందంటే?
కేరళ క్రికెట్ లీగ్లో కొల్లం ఏరీస్ ఫ్రాంఛైజీకి శ్రీశాంత్ సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఆ మధ్య ఓ మలయాళ టీవీ ఛానెల్లో జరిగిన చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో సంజూ శాంసన్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక కాలేదో కారణాన్ని వివరించాడు శ్రీశాంత్. సంజూ.. సెలెక్ట్ కాకపోవడానికి ఓ రకంగా కేసీఏ కారణమని ఆరోపణలు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కేరళ జట్టు తరఫున సంజు ఆడలేదు. అందుకే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కకుండా ఉండేలా కేసీఏ చేసిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇవి కాస్త చర్చనీయాంశంగా మారాయి. అందుకే ఏప్రిల్ 30న సమావేశమైన కేసీఏ.. తాజాగా శ్రీశాంత్ పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

అయితే సంజుకు, శ్రీశాంత్ మద్దతుగా నిలిచినందుకు ఈ నిర్ణయం తీసుకోలేదని.. తమ గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మాట్లాడినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో కేసీఏ తెలిపింది. ఇంకా సంజు ఎంపికపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గానూ.. అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్తో సహా మరో ఇద్దరిపై కూడా నష్టపరిహారం దావా వేయాలని కేసీఏ సభ్యులు నిర్ణయించారని తెలిసింది.
కాగా, గతంలోనూ శ్రీశాంత్ పలు సందర్భాల్లో ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో అలప్పుళ టీమ్ లీడ్, కొల్లం ఏరీస్, అలప్పుళ రిప్పల్స్ ఫ్రాంఛైజీలకు కూా షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కానీ, వాటికి ఆయా ఫ్రాంఛైజీలు సంతృప్తికర సమాధానాలు ఇచ్చాయని, కాబట్టి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని కేసీఏ పేర్కొంది. ఇక సంజు శాంసన్ మొన్నటి వరకు ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు గాయం కారణంగా అతడు ఈ మెగా లీగ్ కు దూరంగా ఉంటున్నాడు.