ఐపీఎల్-2024లో రికార్డు స్కోర్లు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్కు 207 పరుగుల లక్ష్యం పెద్దలెక్క కాదనుకున్నారంతా. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతం చేశారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ వికెట్ల వేట కొనసాగిస్తూ జట్టుకు గొప్ప విజయాన్ని అందించారు. ఉప్పల్లో స్ట్రాంగ్ టీమ్ SRHకు షాక్ ఇచ్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5x4) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4x4, 1x6) అర్ధశతకం అందుకున్నప్పటికీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 118 స్ట్రైక్రేటుతో పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు (3/30) వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40*; 37 బంతుల్లో, 1x4, 1x6) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో, 3x4, 2x6), ప్యాట్ కమిన్స్ (31; 15 బంతుల్లో, 1x4, 3x6) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ (2/29), కామెరూన్ గ్రీన్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటారు.
అయితే SRH ఛేజింగ్ సమయంలో సహయజమాని కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఈ సీజన్లో పవర్ప్లేలో సునాయసంగా 100+ స్కోరు సాధిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో నాలుగు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. 69/5..85/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో స్టాండ్స్లో ఉన్న కావ్య మారన్ షాక్కు గురైంది.
ఇది సన్రైజర్స్ జట్టేనా? అసలేం జరుగుతుంది? అంటూ సింబాలిక్గా కావ్య పాప ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఐపీఎల్-2024లో ఆనందంతో గెంతులేసిన కావ్య సొంతమైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బాధతో కూర్చొంది. అయితే ఓడినప్పటికీ పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఎనిమిది మ్యాచ్లు ఆడిన SRH పది పాయింట్లు, +0.577 నెట్ రన్ రేట్తో మెరుగైన స్థితిలో ఉంది.