సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తోన్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ మరో అడుగు ముందుకేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. తాజాగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంది. అయితే ఈ ఈస్ట్రన్ కేప్ జట్టు.. ఐపీఎల్ ప్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే చెందినదే కావడం విశేషం.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్.. కేవలం రెండు వికెట్లే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ టోనీ డి జోర్జి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 78 పరుగులు చేశాడు. జోర్డాన్ హెర్మాన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 69 అజేయ పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలో వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మాన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 81 అజేయ పరుగులు చేశాడు. ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ (59) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, మార్క్రమ్, బార్టమన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
శనివారం(ఫిబ్రవరి 8)న ఫైనల్ పోరు జరగనుంది. ఈ తుది పోరులో సన్రైజర్స్, ఎంఐ కేప్టౌన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి రెండు సీజన్లలోనూ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో సారి కూడా టైటిల్ ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.