Kavya Maran: ఐపీఎల్ టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా ఉన్న కావ్య మారన్.. ప్రస్తుతం తన సామ్రాజ్యాన్ని ఇంగ్లాండ్ వరకు విస్తరించారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించే "ది హండ్రెడ్" క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును సన్ టీవీ నెట్వర్క్ అధికారికంగా కొనుగోలు చేసింది. ఈ మెగా ఒప్పందం విలువ సుమారు 100.5 మిలియన్ పౌండ్లు అంటే భారత విలువలో దాదాపు రూ.1.161 కోట్లు. ఈ అతిపెద్ద కొనుగోలు ద్వారా సన్రైజర్స్ గ్రూప్ ప్రపంచ క్రికెట్ రంగంలో తన తదుపరి అడుగు వేసింది.
సన్ టీవీ గ్రూపుకు క్రికెట్ జట్లను నిర్వహించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును, దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఏ20 టోర్నమెంట్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును విజయవంతంగా నిర్వహిస్తోంది. సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ఈ జట్ల సీఈవోగా ఉండి చక్కగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మూడో ఖండంలో మూడో జట్టుగా నార్తర్న్ సూపర్ఛార్జర్స్ జట్టును కొనుగోలు చేసింది. ఈ విషయంపై స్టాక్ ఎక్స్చేంజ్కు అందించిన నివేదికలో.."క్రీడా రంగంలో మా ప్రపంచ స్థానాన్ని విస్తరించే లక్ష్యంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్లో భాగంగా ఉన్న నార్తర్న్ ఛార్జర్స్ క్లబ్లో పెట్టుబడి పెట్టాం" అని సన్ టీవీ పేర్కొంది.

నార్తర్న్ సూపర్ఛార్జర్స్ జట్టు గత ఆర్థిక సంవత్సరం ఆదాయం కేవలం రూ.22 కోట్లు (£1.89 మిలియన్లు) మాత్రమే. అయితే, సన్ టీవీ గ్రూప్ అంతకంటే 53 రెట్లు ఎక్కువ ధర చెల్లించి, అంటే రూ.1,161 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించినప్పటికీ, దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ జట్టు ఇప్పటికే లాభాల్లో నడుస్తోంది. అంతేకాకుండా, 100 బంతులు మాత్రమే ఉన్న "ది హండ్రెడ్" టోర్నమెంట్, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. దీని భవిష్యత్ వృద్ధిని పరిగణనలోకి తీసుకునే సన్ టీవీ ఈ పెట్టుబడిని పెట్టింది. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని పనులు డిసెంబర్ 31, 2025 లోపు పూర్తవుతాయని ఆశిస్తున్నారు.
ఈ కొనుగోలు ద్వారా ప్రపంచంలోని వివిధ క్రికెట్ లీగ్లలో జట్లను కలిగి ఉన్న భారతీయ సంస్థల జాబితాలో సన్ టీవీ చేరింది. ఆ జాబితాలోని ఇతర ముఖ్య సంస్థలు:
*రిలయన్స్ ఇండస్ట్రీస్: ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ఎంఐ కేప్ టౌన్ (ఎస్ఏ20), ఎంఐ న్యూయార్క్ (ఎంఎల్సీ), ఎంఐ ఎమిరేట్స్ (ఐఎల్టీ20).
*చెన్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్: సీఎస్కే (ఐపీఎల్), జోబర్గ్ సూపర్ కింగ్స్ (ఎస్ఏ20), టెక్సాస్ సూపర్ కింగ్స్ (ఎంఎల్సీ).
*నైట్ రైడర్స్ గ్రూప్ (షారుఖ్ ఖాన్): కోల్కతా నైట్ రైడర్స్ (ఐపీఎల్), ట్రిన్బాగో నైట్ రైడర్స్ (సీపీఎల్), అబుదాబి నైట్ రైడర్స్ (ఐఎల్టీ20), లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ (ఎంఎల్సీ).
దీని ద్వారా ప్రపంచ క్రికెట్లో భారతీయ సంస్థల ఆధిపత్యం ఎంతగా పెరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. ఇకపై ఇంగ్లాండ్ మైదానాల్లోనూ సన్రైజర్స్ సేన ఆటను ఎదురుచూడవచ్చు.