Karun Nair-KL Rahul: భారత క్రికెటర్ కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్కు సంబంధించిన ఒక వైరల్ వీడియో ఇటీవల అభిమానుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్కు ముందు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టుకోగా.. స్నేహితుడు కేఎల్ రాహుల్ ఓదార్చినట్లుగా ఈ వీడియోలో చూపించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవం బయటపడింది. ఆ వీడియోపై స్పయంగా కరుణ్ నాయర్ ఒక ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని స్పష్టం చేశారు.
సుమారు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరుణ్ నాయర్ ఇంగ్లండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారతీయ బ్యాటర్గా ఆయనకు ఉన్న ప్రత్యేక గుర్తింపుతో అభిమానులు, నిపుణులు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కరుణ్ నాయర్కు అవకాశం లభించిన మొదటి మూడు టెస్టుల్లో ఆయన అంచనాలను అందుకోలేకపోయారు. ఆయన మొదటి టెస్టుల్లో 0, 20, 31, 26, 40, 14 వంటి తక్కువ స్కోర్లు మాత్రమే చేశాడు.

దీంతో టెస్ట్ సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్కు ముందు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే కరుణ్ నాయర్ ఒక బాల్కనీలో కన్నీళ్లతో కూర్చుని ఉండగా.. కేఎల్ రాహుల్ వచ్చి భుజంపై చేయి వేసి ఓదార్చినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించింది.
వీడియోలో నిజం ఎంత?.. కరుణ్ నాయర్ మాటల్లో వాస్తవం
ఈ వీడియోను చూసి చాలా మంది అభిమానులు కేఎల్ రాహుల్ స్నేహాన్ని ప్రశంసించగా.. మరికొందరు కరుణ్ నాయర్కు సంఘీభావం తెలిపారు. అయితే కొందరు పరిశీలనాత్మక అభిమానులు వీడియోలో ఉన్న కొన్ని లోపాలను గుర్తించారు. ఆ వీడియోలో ఉన్నది మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం బాల్కనీ కాదని.. అది లార్డ్స్ మైదానం బాల్కనీ అని తేల్చారు. దీంతో ఈ వీడియో మాంచెస్టర్ టెస్టు సమయంలో తీసినది కాదని నిర్ధారణకు వచ్చారు. ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ.. కరుణ్ నాయర్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. "నేను ఆ వీడియోను చూశాను. అది ఏఐ సాయంతో సృష్టించబడిన వీడియో అని నేను అనుకుంటున్నాను. అది నిజమైన సంఘటన కాదు." అని కరుణ్ నాయర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, "మేము ఇద్దరం బాల్కనీలో కలిసి కూర్చున్నది నిజమే, కానీ వీడియోలో చూపినట్లుగా ఏదీ జరగలేదు" అని ఆయన ధ్రువీకరించారు.
కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్
జట్టు నుంచి తప్పించబడటం, ఫామ్లో లేకపోవడం వంటి కష్టకాలంలో తన స్నేహితుల మద్దతు గురించి కరుణ్ నాయర్ ఎమోషనల్గా మాట్లాడారు. కర్ణాటకకు చెందిన తన సహచర క్రికెటర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ సమయంలో తనకు చాలా అండగా నిలిచారని చెప్పారు. "ప్రసిద్ధ్ కృష్ణ, కేఎల్ రాహుల్ నా వెంట ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. గత రెండు నెలల్లో మేము చాలా సమయం కలిసి గడిపాం. క్రికెట్ గురించి, మళ్లీ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి రావడం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం" అని ఆయన వివరించారు.దీని ద్వారా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నది ఒక నకిలీ ఏఐ ఫుటేజ్ అని, కరుణ్ నాయర్ను కేఎల్ రాహుల్ కన్నీళ్లతో ఓదార్చడం నిజంగా జరగలేదని స్పష్టమైంది.