
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ శుక్రవారం ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ప్రెండ్ సనాయా తకరివాలాని ఉదయ్పూర్లో వివాహామాడాడు. ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
కరుణ్ నాయర్ వివాహానికి సంబంధించిన ఫోటోని జార్ఖండ్ పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ తన ఇనిస్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ ఫోటోలో కొత్త పెళ్లి దుస్తుల్లో అందంగా మెరిసిపోతున్న జోడీని వీక్షించొచ్చు. గతేడాది జూన్లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది.
చెన్నై వేదికగా 2016లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. తద్వారా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు.
కరుణ్ నాయర్ జింబాబ్వే జట్టుపై హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 11 జూన్ 2016న జరిగిన మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేశాడు. 26 నవంబరు 2016న మొహాలీలో ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 77 మ్యాచ్లాడి 49.5 యావరేజితో 5446 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరుపున రెండు వన్డేలాడిన కరుణ్ నాయర్ 46 పరుగులు చేశాడు. ఇక, ఐపీఎల్లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.