హైదరాబాద్: భారత-ఏ జట్టును మరిన్ని విదేశీ పర్యటనలకు పంపాలన్న బీసీసీఐ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోందని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ భారత-ఏ జట్టులో రాణించడం వల్లనే కరుణ్ నాయర్, జయంత్ యాదవ్లు వెలుగులోకి వచ్చారని వెల్లడించాడు.
టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తిస్తా: తెలుగు క్రికెటర్లకు అన్యాయంపై ఎమ్మెస్కే ప్రసాద్
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు భారత-ఏ జట్టు విదేశాల్లో ఎక్కువగా పర్యటించేలా ప్రణాళికలను సిద్దం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ మేరకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని చెప్పాడు. ప్రస్తుతం భారత టెస్టు క్రికెట్లో ఆడుతున్న కరుణ్ నాయర్, జయంత్ యాదవ్ లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు లభించారంటే కారణం అదే కదా అని తెలిపాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టు సభ్యుల్లో వారిద్దరూ ఉన్నారు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఆటగాడైన కేన్ రిచర్డసన్ బౌలింగ్ను కరుణ్ నాయర్ ఎదుర్కొన్నాడు. దీంతో పాటు ప్రస్తుత ఆసీస్ టెస్టు జట్టులో ఉన్న నిక్ మాడిన్సన్, పీటర్ హ్యాండ్స్ కోంబే లాంటి ఆటగాళ్లకు బౌలింగ్ కూడా చేశాడు.
ఇక క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్లో వారిద్దరూ అపార అనుభవాన్ని సంపాదించారని అన్నాడు. ప్రతిభావంతులకు టీమిండియాలో అవకాశాలుంటాయని, ఒకటి లేదా రెండు మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన వారిని విస్మరించాల్సిన అవసరం లేదన్నాడు.
చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడం తనకు ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. మ్యాచ్ని గెలిపించడంలో కరుణ్ నాయర్పై మాకు పూర్తి విశ్వాసముందని వెల్లడించాడు. చెన్నైలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ 303 నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.