బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కుమారుడు: ట్విట్టర్లో ప్రశ్నించిన కార్తీ చిదంబరం

హైదరాబాద్: ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నామినేషన్ వేయగా... సెక్రటరీగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా నామినేషన్ దాఖలు చేశారు. వీరి నామినేషన్ పత్రాలను బీసీసీఐ ఎన్నికల అధికారి కూడా ధృవీకరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికల ప్రక్రియపై కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ట్విట్టర్లో స్పందించారు. "యూపీఏ హయాంలో మా నాన్న హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యుంటే.. జాతీయవాదులు, భక్తులు ఎలా స్పందించేవారు?" అని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు "జస్ట్ ఆస్కింగ్" అనే హ్యాష్టాగ్ను కూడా జత చేయడం విశేషం. భారత క్రికెట్కు జై షా కొత్తేమీ కాదు. గతంలో అమిత్ షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జైషా జాయింట్ సెక్రటరీగా కొనసాగారు. ఈ ఏడాది ఆరంభంలో ఉపాధ్యక్షుడు పరిమాల్ నత్వానీతో పాటు వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అందరూ ఏకగ్రీవమే
భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తుల్లో జై షా మాత్రమే సభ్యుడు కాదు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమల్ సైతం బీసీసీఐ కొత్త టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. అరుణ్ ధుమల్ బీసీసీఐ కోశాధికారి పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
బీసీసీఐలో అనేక మంది పదవులు
దీనిపై కొందరు నెటిజన్లు గతంలో పలువురు రాజకీయ నాయకులు బీసీసీఐలో అనేక పదవులను అనుభవించారు కదా అని బదులిచ్చారు. శరద్ పవార్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు, లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్లో, సీపీ జోషి రాజస్థాన్ క్రికెట్లో, జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ క్రికెట్లో చక్రం తిప్పారని అన్నాడు.
కార్తీ ట్వీట్కు ఓ నెటిజన్ ఇలా
అయితే, కార్తీ ట్వీట్కు ఓ నెటిజన్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు. అమిత్ షా తనయుడిపై "వ్యాపార రంగంలో జై షా కంపెనీ ఒక్క ఏడాదిలోనే 16 వేల రెట్లు వృద్ధి చెందింది. ఇక క్రికెట్ రంగంలో బీసీసీఐ కార్యదర్శిగా అతడి మ్యాజిక్ కొనసాగనుంది. జైషా అసలైన చాణక్యుడు" అంటూ ట్వీట్ చేశాడు.
తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్లో కార్తి చిదంబరం పాత్ర
గతంలో తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్లో కార్తి చిదంబరం పాత్రను ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఈ మేరకు ఎకనామిక్స్ టైమ్స్కు సంబంధించిన ఆర్టికల్ను జత చేశాడు. కార్తి చిదంబరం గతంలో ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్లో కార్యదర్శిగా, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్
గంగూలీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా... కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు), మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్ సింగ్ ధూమల్ (ట్రెజరర్), బ్రిజేష్ పటేల్ (ఐపీఎల్ ఛైర్మన్), జయేష్ జార్జ్ (జాయింట్ సెక్రటరీ), ఖైరుల్ మజుందార్ (కౌన్సిలర్), ప్రభ్జ్యోత్ సింగ్ (కౌన్సిలర్) కూడా నామినేషన్లు వేశారు.

అక్టోబర్ 23న అధికారిక ప్రకటన
అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదివారం ఉదయం వరకు బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు పదవికి ముందు వరుసలో ఉన్నాడు. అయితే, కొన్ని గంటల్లోనే పరిస్థితులు గంగూలీకి అనుకూలంగా మారిపోయాయి. అనూహ్యాంగా తెరపైకి గంగూలీ పేరు వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications