బెంగళూరులో ఇటీవల జరిగిన దుర్ఘటన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక కీలక ప్రకటన చేశారు. కర్ణాటక హౌసింగ్ బోర్డు(KHB) ఆధ్వర్యంలో సూర్య సిటీ, బొమ్మాసంద్రలో ప్రపంచ స్థాయి క్రీడా సముదాయాన్ని నిర్మించడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తియితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం తర్వాత ఇది దేశంలోనే రెండో అతిపెద్ద స్టేడియంగా నిలుస్తుంది. ఈ నిర్ణయం జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఎం.చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వచ్చింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు.
భారీ వ్యయంతో ప్రాజెక్ట్
* ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.1,650 కోట్లు.
* దీనికి పూర్తిగా కర్ణాటక హౌసింగ్ బోర్డు నిధులు సమకూరుస్తుంది.
* మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రీడా సముదాయం నిర్మించబడుతుంది.
* క్రికెట్ స్టేడియంతో పాటు ఈ కాంప్లెక్స్లో 8 ఇండోర్, 9 ఔట్ డోర్ క్రీడల కోసం సౌకర్యాలు, అత్యాధునిక జిమ్, శిక్షణా కేంద్రాలు, స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ హౌస్లు, హాస్టళ్లు, హోటళ్లు, అంతర్జాతీయ కార్యక్రమాల కోసం ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఉంటాయి.
*ఇది బీసీసీఐ నిర్మించిన కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాదిరిగానే ఉంటుంది.

చిన్నస్వామి స్టేడియంపై అనుమానాలు
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా కమిషన్ కేవలం 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న 32,000 మంది సామర్థ్యం గల చిన్నస్వామి స్టేడియం వద్ద ఈవెంట్లకు అనువైనది కాదని నిర్ధారించింది. మెరుగైన సౌకర్యాలు, పార్కింగ్ ఉన్న పెద్ద స్థలాలకు అటువంటి మ్యాచ్లను మార్చాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ నివేదిక తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA) వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పోలీసుల అనుమతి లభించకపోవడంతో 025లో జరగాల్సిన మహారాజా ట్రోఫీ టీ20 టోర్నమెంట్ను మైసూర్కు మార్చారు. దీంతో ఈ ఏడాది చివర్లో జరగబోయే మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లు, అలాగే 2026లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియం నిర్వహించడంపై అనుమానాలు నెలకొన్నాయి.