అడిలైడ్: ఆస్టేలియాలో జరుగుతున్న అడిలైడ్ టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన భారత యువ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో కర్ణ్ శర్మ 23 ఓవర్లు వేసి 89 పరుగులతో పాటు సెంచరీ చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ను పెవిలియన్కు పంపాడు.
తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి చెప్పిన మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని చెప్పాడు. తాను తుది జట్టులో ఉన్న విషయాన్ని మంగళవారం ఉదయాన్నే చెప్పారని అన్నాడు.

తొలిటెస్టు మ్యాచ్లో ఆడుతున్న సందర్భంగా సాంకేతికంగా, మానసికంగా రవిశాస్త్రి ఎంతో సహకారం అందించారని, ఇతర కోచింగ్ సిబ్బంది కూడా సాయపడ్డారని శర్మ పేర్కొన్నాడు. ఇక, కెప్టెన్ కోహ్లీ... బౌలింగ్ తీరు, బంతులు విసరాల్సిన లైన్, ఫీల్డింగ్ ప్లేస్ మెంట్లు వంటి అంశాలపై తనతో మాట్లాడాడని పేర్కొన్నాడు.
తాను లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, వన్డే క్రికెట్, టి20 ఫార్మాట్లో లాగే బౌలింగ్ చేసి మంచి ఫలితాలను రాబట్టానని చెప్పాడు. తొలి టెస్టులో డేవిడ్ వార్నర్ వికెట్ పడగొట్టడం ద్వారా కీలక భాగస్వామ్యాన్ని విడదీయడం సంతోషాన్నిచ్చిందని చెప్పాడు.
తొలి టెస్టు మ్యాచ్లో 18వ ఓవర్లోనే బౌలింగ్ చేయాల్సి రావడం కాస్తంత ఒత్తిడికి గురయ్యారా... అన్న ప్రశ్నకు.. దేశవాళీ క్రికెట్లో వేసే బౌలింగ్నే వేశానని పేర్కొన్నాడు.