డబ్బు అవసరమైతే.. ముందు బార్డర్లో పరిస్థితులు అదుపు చేయండి: కపిల్

ముంబై: కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నిధులు సేకరించడానికి భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించాలనే షోయబ్ అక్తర్ ఆలోచనను లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి తోసిపుచ్చారు. మీకు డబ్బు అవసరమైతే ముందు బార్డర్లో పరిస్థితులు అదుపు చేయండన్నారు. డబ్బును సేకరించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని కపిల్ దేవ్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో క్రికెట్ కన్నా ముందు విద్యా సంస్థలు తెరచుకోవాలన్నారు.

బార్డర్లో పరిస్థితులు అదుపు చేయండి:
కరోనాపై పోరులో విరాళాల సేకరణకు భారత్-పాక్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆడాలని అక్తర్ సూచించిన సంగతి తెలిసిందే. ఇదివరకే దీన్ని ఖండించిన కపిల్.. మరోసారి తన అభిప్రాయాన్ని చెప్పారు. 'అక్తర్ చెప్పిన విషయాన్ని భావోద్వేగంగా ఆలోచిస్తే.. అవుననే అంటారు. భారత్-పాక్ మ్యాచ్లు ఆడొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడటం ముఖ్యం కాదు. మీకు డబ్బు అవసరమైతే ముందు బార్డర్లో పరిస్థితులు అదుపు చేయండి' అని కపిల్ మరోసారి అక్తర్కు చురకలేసారు.

ముందుగా విద్యాసంస్థలు తెరచుకోవాలి:
ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ పునరుద్ధరణ గురించి కాకుండా విద్యార్థుల చదువుల గురించి ఆలోచించాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ సూచించారు. 'నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రికెట్ గురించి మాట్లాడటం అస్సలు సమంజసం కాదు. నేనైతే విద్యార్థుల చదువుల గురించి ఆందోళన చెందుతున్నా. వాళ్లంతా మన భావితరాలు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. నేనైతే ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాత క్రికెట్, ఫుట్బాల్ వాటంతట అవే పునఃప్రారంభం అవుతాయి' అని స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో అన్నారు.

అక్తర్ ప్రతిపాదన:
కరోనాతో ఇరు దేశాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ వన్డే సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తద్వారా వచ్చే విరాళాలను ఇరు దేశాలు సమంగా పంచుకోవాలని ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ సూచించాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, ప్రేక్షకాదరణ కూడా గణనీయంగానే ఉంటుదన్నాడు.

మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు:
అక్తర్ అభిప్రాయాన్ని కపిల్ దేవ్ మాత్రం వ్యతిరేకించాడు. 'భారత్-పాక్ల మధ్య సిరీస్ జరగాలని కోరడం అక్తర్ అభిప్రాయం. కానీ ఈ సిరీస్ల ద్వారా వచ్చే డబ్బు భారత్కు అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభం నుంచి గట్టెక్కడమే ముఖ్యం. ఇప్పటికే కరోనా కట్టడికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. క్రికెటర్లతో ఎలా రిస్క్ చేస్తాం' అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications