
క్రికెటర్లు ఎక్కువగా ఒత్తిడికి గురైనట్లు భావిస్తే.. ఐపీఎల్లో ఆడడం మానేయాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం క్రికెట్లో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నామంటూ కొందరు ఆటగాళ్లు పేర్కొంటున్నారని, దీనికి సొల్యూషన్ ఏంటని ఓ షో హోస్ట్ కపిల్ దేవ్ను అడగగా.. కపిల్ దేవ్ నిర్మొహమాటంగా బదులిచ్చాడు. ఐపీఎల్ లాంటి విపరీత క్రికెట్ ఆడడం వల్లే ప్లేయర్లు ఒత్తిడికి గురవుతున్నారని, అందుకు సంబంధించే తాను చాలా ఫిర్యాదులను విన్నానని కపిల్ పేర్కొన్నాడు. 'ఐపీఎల్లో ఆడే ప్లేయర్లు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నామంటూ మాట్లాడడం నేను చాలా సార్లు టీవీలో చూశాను. అలాంటి ప్లేయర్లందరికీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఎంచక్కా ఐపీఎల్ ఆడడం మానేయండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది.' అని కపిల్ దేవ్ అన్నాడు. ఆటగాడికి అభిరుచి ఉంటే.. ఒత్తిడి ఉండదని, డిప్రెషన్ లాంటి అమెరికన్ పదాలను తాను అర్థం చేసుకోలేనని కూడా కపిల్ అన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ ఆడాలని, అప్పుడే ఆనందానికి లోనవుతామని, ఆనందమున్న చోట ఎలాంటి ఒత్తిడి ఉండదని, ఇది గేమ్ అని ఫీల్ కావాలని దేవ్ తెలిపాడు.
గత నెలలో చార్లీ డీన్ను దీప్తి శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఔట్ చేయడం గురించి కపిల్ దేవ్ స్పందించాడు. ఈ ఘటన గురించి కపిల్ మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలపై పెద్దగా డిబేట్లు జరగకపోవడమే మంచిదని, ఇదో సాధారణ విషయంలా పరిగణించాలని పేర్కొన్నాడు. బ్యాటర్లకు పరుగులు రాకుండా చేయడమే బౌలర్ ఆలోచించాల్సిన విధానమని అది ఎలాంటి సందర్భంలోనైనా సరేనంటూ కపిల్ చెప్పాడు. అదే తన ప్రకారం కరెక్ట్ అంటూ అన్నాడు.