పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వాస్తవానికి మొదటి టెస్టు కంటే రెండో టెస్టులోనే భారత్ మరింత బలంగా బరిలోకి దిగింది.
సారథి రోహిత్ శర్మ జట్టులోకి తిరిగొచ్చాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా అతను జట్టుకు కొండంత బలం. యువ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతంగా కనిపించింది. కానీ పింక్ బాల్ టెస్టులో ఊహించని పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా ముందు టీమిండియా పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నలు వస్తున్నాయి. బుమ్రాకు సారథి బాధ్యతలు అందివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.

దీనిపై 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్క విజయాన్ని చూసి గొప్ప కెప్టెన్ అని నిర్ధారించలేమని, ఒక్క ఓటమి చూసి ఉత్తమ సారథి కాదని అంచనాకు రాలేమని అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వేటు వేయొద్దని, జట్టు నాయకుడిగా అతన్ని కొనసాగించాలని సూచించాడు. కాగా, న్యూజిలాండ్ సిరీస్లో వైట్ వాష్ ఓటమితో పాటు అడిలైట్ టెస్టులో పరాజయాన్ని చవిచూడటంతో.. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు చవిచూసిన భారత మూడో సారథిగా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన రోహిత్ చేరాడు.
''కెప్టెన్సీ మార్పు గురించి ఇప్పుడే మాట్లడటం తొందరపాటే. ఒక్క ప్రదర్శన చూసి, అత్యుత్తమం అని చెప్పలేం. అలాగే ఒక చెత్త ప్రదర్శనతో సారథిగా పనికిరాడని అంచనాకు రాలేం. ఓ ఆటగాడు ఎంతో క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఎత్తుపల్లాలు చూడాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో అతను ఎలా స్పందిస్తున్నాడనే దాని బట్టి మనం ఓ నిర్ణయానికి రావాలి. రోహిత్ తిరిగి పుంజుకుంటాడని ఆశిస్తున్నా'' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.