ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ మంగళవారం కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఉండవల్లిలో సీఎంతో కపిల్దేవ్ మాట్లాడారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు, క్రికెట్ అభివృద్ధిపై చర్చించారు. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కపిల్ దేవ్ బాధ్యతలు వహిస్తున్న విషయం తెలిసిందే.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో క్రీడా సంబంధిత విషయాలను చర్చించానని కపిల్ దేవ్ తెలిపారు. క్రీడలను మరింతగా ప్రోత్సహించాలనే దృక్పథంతో ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని, అవకాశాలకు అనుగుణంగా గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేస్తామని కపిల్ దేవ్ వెల్లడించారు. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వ నిర్ణయమని, స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తామని అన్నారు.

కేశినేని చిన్ని మాట్లాడుతూ అనంతపురం, అమరావతి, విశాఖ ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్సులు పెడతామని అన్నారు. రేంజ్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏపీ అంబాసిడర్గా ఉండాలని కపిల్దేవ్ను కోరినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీసేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా రాష్ట్ర క్రీడాకారులు సిద్ధం చేస్తామని అన్నారు.

''ఏపీ అంబాసిడర్గా ఉండాలని కపిల్దేవ్ను కోరాం. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నాం. గోల్ఫ్ డ్రైవింగ్కు రేంజ్లు సిద్ధం చేస్తాం. తదుపరి సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తాం'' అని కేశినేని చిన్ని తెలిపారు.