టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పుష్కర కాలంగా కోహ్లి-రోహిత్ భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్కసారిగా ఇద్దరూ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరనే చర్చ మొదలైంది.
జింబాబ్వే పర్యటనతో రోహిత్, కోహ్లి వారసులను వెతకడంలో బీసీసీఐ బిజీబిజీగా అయ్యింది. శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లను టాప్ ఆర్డర్లో ఆడించింది. అందరూ నిలకడగానే పరుగులు సాధించారు. అయితే రోహిత్-కోహ్లి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల దొరకరి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తరహానే రోహిత్-కోహ్లి చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతారని, ఎవరూ వాళ్లను భర్తీచేయలేరని తెలిపాడు.

''ఏ ఫార్మాట్లో అయినా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయలేరు. భారత క్రికెట్కు వారెంతో సేవలు అందించారు. టీ20ల్లో వాళ్లకు మంచి ముగింపు దక్కింది. అన్ని ఫార్మాట్లలో కోహ్లి తన ప్రత్యేకత చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్లో మాత్రం అతన్ని కచ్చితంగా మిస్ అవుతాం. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తరహాలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. వాళ్లను ఇతరులతో భర్తీ చేయలేం'' అని కపిల్ దేవ్ అన్నాడు.
35 ఏళ్ల కోహ్లి భారత్ తరఫున 113 టెస్టులు, 292 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో కోహ్లి 48 సగటు, 137 స్ట్రైక్రేటుతో 4188 పరుగులు చేశాడు. 38 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. ఇక, 37 ఏళ్ల రోహిత్ శర్మ 59 టెస్టులు, 262 వన్డేలు, 159 టీ20లు ఆడాడు. టీ20ల్లో హిట్ మ్యాన్ 31 సగటు, 140 స్ట్రైక్రేటుతో 4231 పరుగులు చేశాడు. 5 శతకాలు, 32 అర్ధశతకాలు సాధించాడు.