
చండీగఢ్: టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడల విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా హరియాణా ప్రభుత్వం కపిల్ దేవ్ను నియమించింది. ఈ మేరకు హరియాణా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ అధికారికంగా ప్రకటించారు. సోనేపట్లోని రాయ్లో ఏర్పాటు చేయనున్న వర్సిటీకి హరియాణా హరికేన్గా పేరుగాంచిన కపిల్దేవ్ తొలి ఛాన్సలర్గా నియమితులయ్యారు.
జులై 16న జరిగిన హరియాణా కేబినెట్ సమావేశంలో రాయ్లో క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడా శాస్త్రాల్లో అకడమిక్, శిక్షణా కార్యక్రమాలను ఈ వర్సిటీ నిర్వహించనుందని మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇటీవలే వర్సిటీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పిన మూడో రాష్ట్రంగా హరియాణా నిలిచింది. ఇప్పటివరకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయగా.. తాజాగా ఆ జాబితాలో హరియాణా చేరింది.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలోనే భారత జట్టు ప్రపంచ కప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. కపిల్ మార్గదర్శకంలో హరియాణా విశ్వవిద్యాలయం అభివృద్ది చెందాలని భావిస్తున్నట్లు అనిల్ విజ్ పేర్కొన్నారు. ఇప్పటికే యునివర్సిటీలో చేర్చాల్సిన కోర్సులు, సిలబస్, విధివిధానాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేస్తున్నామని, ఈ యూనివర్సిటీలో అందిస్తున్న సౌకర్యాలతో హరియాణా క్రీడా రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.