ముంబయి: కాన్పూర్ పిచ్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ని వివరణ కోరింది. ఐదు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి బిసిసిఐకి లేఖ రాసింది. ఈ మ్యాచులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. పిచ్ పగుళ్ల వల్ల, అసాధారణమైన బౌన్స్ వల్ల బ్యాట్స్ మెన్ పరుగులు చేయడం అతి కష్టంగా మారింది. దీంతో మహానామా ఐసిసికి ఒక నివేదిక సమర్పించారు.
బిసిసిఐకి లేఖ రాశామని, రోషన్ మహానామా ఈ ప్రక్రియను ప్రారంభించారని, మహానామా నివేదిక అందిన తర్వాత తాము ఆ లేఖ రాశామని, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఈసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాల్కం స్పీడ్ ముంబయిలో చెప్పారు. ఐసిసి లేఖ రాయడానికి పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పడానికి బిసిసిఐ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నాకర్ సెట్టి ప్రయత్నించారు. మ్యాచ్ రెఫరీ ఐసిసికి నివేదిక సమర్పించడం, ఐసిసి లేఖ రాయడం సర్వ సాధారణమైన విషయమని ఆయన అన్నారు.