భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్కు న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. రెండో టీ20లో రాణించిన అతను.. మూడో టీ20కి దూరం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని న్యూజిల్యాండ్ జట్టు అధికారికంగా ప్రకటించింది కూడా. అతని స్థానంలో వెటరన్ పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందే ఆస్పత్రిలో కేన్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని, ఈ మ్యాచ్ షెడ్యూల్ దాంతో క్లాష్ అవడంతోనే మూడో టీ20లో కేన్ ఆడటం లేదని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు.
కేన్ విలియమ్సన్ చాలా కాలంగా మోచెయ్యి సమస్యతో బాధ పడుతున్నాడు. అతను క్రికెట్లో ఫామ్ కోల్పోవడానికి కూడా అదే కారణం. అయితే ఇప్పుడు తీసుకున్న డాక్టర్ అపాయింట్మెంట్ దానికి కాదని స్టెడ్ స్పష్టం చేశాడు. కేన్ జట్టులో చాలా విలువైన ఆటగాడని, అతను బ్యాటింగ్ లైనప్లో కొత్తదనాన్ని తీసుకొస్తాడని వివరించాడు. మూడో టీ20లో కేన్ స్థానంలో మార్క్ చాప్మాన్ ఆడుతున్నట్లు తెలిపాడు. అతను కూడా క్వాలిటీ ప్లేయర్ అని కొనియాడాడు. చాప్మాన్ చివరగా టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆడాడు.
మూడో టీ20కి కేన్ విలియమ్సన్ దూరమైనప్పటికీ.. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ సమయానికి మళ్లీ జట్టుతో కలుస్తాడని గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. బుధవారం నాటికి ఆక్లాండ్లో జట్టుతో కలుస్తాడని తెలిపాడు. కాగా, రెండో టీ20లో ఒక పక్క టపటపా వికెట్లు పడుతున్నా కూడా కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు. చేతిలో వికెట్లు లేకపోవడంతో ఆచితూచి ఆడిన అతను.. 52 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అయితే అతనికి సహకారం అందించే వాళ్లెవరూ లేకపోవడంతో భారత్ చేతిలో 65 పరుగుల తేడాతో న్యూజిల్యాండ్ ఓటమి చవిచూసింది.