ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచులన్నింటినీ దుబాయ్లోని ఒకే పిచ్ పై ఆడటంతో ప్రయోజనం పొందుతోందని వస్తోన్న వాదనలను తాను పట్టించుకోనని అన్నాడు న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమన్స్. ఇలాంటి అంశాలు కేవలం ఆటలో ఓ భాగం మాత్రమే అని, వాటిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ విషయంపై తమ జట్టు పెద్దగా దృష్టి సారించదని చెప్పాడు. ఇది తమ పరిధిలో లేని విషయమని పేర్కొన్నాడు. వేదిక ఏదైనా, పరిస్థితి ఏదైనా.. తమ జట్టు బాగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అయితే భారత్ ఏ పరిస్థితులోనైనా తమకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
ఏదైనా జరగొచ్చు..
"నిజమే పిచ్ కండిషన్స్ చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఏ టోర్నమెంట్లోనైనా, పరిస్థితులు కాస్త మారుతూ ఉండటం సహజం. మేము ఫైనల్ మ్యాచ్ ను భారత్ పై ఆడటం మంచి విషయం. టీమిండియా అద్భుతమైన జట్టు. నిజంగా చాలా బాగా ఆడుతోంది. అందుకే ఫైనల్ మ్యాచ్ నుంచి మేం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి.. ఈ తుది పోరులో ఏదైనా జరగొచ్చు. ఈ ఆఖరి మ్యాచ్ కచ్చితంగా మంచి అనుభూతిని ఇవ్వడంతో పాటు గొప్ప మ్యాచ్ గా నిలిచిపోతుందని భావిస్తున్నాను. " అని విలియమ్సన్ అన్నాడు.
