
వెల్లింగ్టన్: టీమిండియాతో పోరు ఎప్పుడూ సవాలే అని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నాడు. ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్ పట్ల ఆసక్తి పెరిగిందన్నాడు. ఈ రెండేళ్లలో ఉత్కంఠకరమైన టెస్టు సిరీసులను ఎన్నో చూడగలిగామని కేన్ పేర్కొన్నాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, భారత్ జట్లు టెస్టు ఛాంపియన్ఫిప్ ఫైనల్స్లో తలపడనున్నాయి.
ఛాంపియన్ఫిప్ ఫైనల్స్కు మరో నెల రోజులే ఉండటంతో కేన్ విలియమ్సన్ ఐసీసీతో మాట్లాడాడు. 'టెస్టు ఛాంపియన్షిప్ సరైన ఉద్దేశాన్ని మనం చూడగలిగాం. ఇది సుదీర్ఘ ఫార్మాట్పై ఎంతో ఆసక్తి పెంచింది. మనం డిక్లరేషన్లు చూశాం, హోరాహోరీగా తలపడ్డ మ్యాచులూ వీక్షించాం. భారత్-ఆస్ట్రేలియా సిరీసు, న్యూజిలాండ్-పాకిస్థాన్ సిరీసులు ఇందుకు మంచి ఉదాహరణలు. ఫలితాల కోసం జట్లు ఎంతగానో శ్రమించాయి. రిస్క్ తీసుకున్నాయి' అని కేన్ అన్నాడు.
'మేం ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్నందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. తొలిసారి టైటిల్ కాబట్టి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. టీమిండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ ఉంటారు. ఫైనల్ గెలిచేందుకే ప్రయత్నిస్తాం' అని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఛాంపియన్షిప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో కేన్ సేన ముందుగా రెండు టెస్టులు ఆడనుంది. మరోవైపు భారత్ సైతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమైంది. బుధవారం ముంబైలో జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక్కచోటికి చేరనున్నారు. అక్కడ వారం పాటు క్వారంటైన్లో ఉంటారు. జూన్ 2న ముంబై నుంచి బయలుదేరుతారు. ఇక సౌథాంప్టన్ చేరుకున్నాక అక్కడా కఠిన క్వారంటైన్లో ఉంటారు. ఆపై ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఆడుతారు.