న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన విలియమ్సన్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు. అంతేగాక 2024-25కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరస్కరించనున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటానని విలియమ్సన్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఘోర వైఫల్యమే కేన్ విలియమ్సన్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. పొట్టి కప్ చరిత్రలో తొలిసారిగా కివీస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్కు చేరలేదు. ఈ మెగాటోర్నీలో గ్రూప్-సీలో ఉన్న బ్లాక్క్యాప్స్ తమ తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ చేతిలో 84 పరుగుల ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన పోరులో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

అనంతరం పసికూనలు ఉగాండ, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా తొమ్మిది, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్-సీ టేబుల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని, జట్టుకు తిరిగి ఇంకా చేయాలనే కోరిక తనలో ఉందని విలియమ్సన్ చెప్పాడు.
అయితే ఇంకా ఆడతానని పరోక్షంగా ప్రకటించిన విలియమ్సన్ క్రికెట్ ప్రపంచం అవతల పరిస్థితులు మారిపోయాయని, కుటుంబంతో సమయాన్ని గడపడం తనకి ఎంతో ముఖ్యమని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్-2026లో బరిలోకి దిగుతారా అనే ప్రశ్నకు.. దానికి ఎంతో సమయం ఉందని, పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దామని చెప్పాడు. తన కెప్టెన్సీలో కేన్ మామ ఎన్నో ఘనతలు సాధించాడు.
టెస్టు ఛాంపియన్షిప్-2021లో న్యూజిలాండ్ను విశ్వవిజేతగా నిలిపాడు. 2019 వన్డ్ ప్రపంచకప్, 2021 టీ20 వరల్డ్ కప్ల్లో కివీస్ను ఫైనల్కు చేరాడు. ఇక ఇటీవల తన కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని విలియమ్సన్ అందుకున్నాడు. 165 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. వీటిల్లో 40 టెస్టులకు, 91 వన్డేలకు, 75 టీ20లకు జట్టును నడిపించాడు.