
హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో కేన్ విలియమ్సన్ ఒక పరుగు చేయడంతో ప్రపంచకప్ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే (548; 2007లో)ను అధిగమించాడు. 2007లో శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్దనె 11 ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా, జోప్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతికి కేన్ విలియమ్సన్ ఒక పరుగు తీశాడు.
దీంతో జయవర్దనే రికార్డుని బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్కి ముందు కేన్ విలియమ్సన్ ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్లోనే 548 పరుగులు చేసి అతడితో సమానంగా ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీపాంటింగ్ 2007లో తొమ్మిది ఇన్నింగ్స్లో 539 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2003లో అత్యధిక సెంచరీలు(3) బాదిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో నికోల్స్ (10), విలియమ్సన్ (1) పరుగులతో ఉన్నారు.
ప్రపంచకప్లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదుసార్లు న్యూజిలాండ్ గెలవగా, నాలుగు సార్లు ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. 1992 తర్వాత మళ్లీ ఫైనల్కు చేరడం ఇంగ్లాండ్కు ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా, ప్రపంచకప్ చరిత్రలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఐదోసారి ఫైనల్స్కు ఆతిథ్యమివ్వబోతోంది. కాగా, ఈ ప్రపంచకప్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్దే పైచేయి. ఈ మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా... తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారు.